
టోక్యో: జపాన్ వేదికగా ప్రతిష్ఠాత్మకంగా సాగుతోన్న టోక్యో ఒలింపిక్స్లో భారత్.. మరో ఈవెంట్లో ఫైనల్స్కు అర్హత సాధించింది. టోక్యో ఒలింపిక్స్ అంటే.. బ్యాడ్మింటన్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, హాకీ.. ఇలాంటి వార్తల చుట్టే తిరుగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఎలాంటి అంచనాలు, ఒత్తిళ్లు లేకుండా బరిలోకి దిగిన ఈ ఈవెంట్లో భారత అథ్లెట్ గప్చుప్గా ఫైనల్స్కు చేరుకున్నాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో అద్భుతంగా రాణించాడు. అంచనాలకు మించిన స్థాయిలో సత్తా చాటాడు. ఇంకొన్ని గంటల్లో ఫైనల్ కూడా ప్రారంభం కాబోతోంది.
మరో పతకం ముగింట్లో భారత్ నిలిచిందన్నమాటే. ఆ ఈవెంట్.. ఈక్వెస్ట్రియన్. ఇందులో భారత్కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడు ఫవాద్ మిర్జా. బెంగళూరుకు చెందిన ఫవాద్ ఇప్పటికే ఈక్వెస్ట్రియన్గా సత్తా చాటాడు. 2018 ఆసియా గేమ్స్లో ఇండివిడ్యువల్, టీమ్ ఈవెంటింగ్లో రజత పతకాలను గెలుచుకున్నాడు. ఈ సారి ఒలింపిక్స్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నాడు. ఈక్వెస్ట్రియన్ జంపింగ్ ఇండివిడ్యువల్ కేటగిరీ క్వాలిఫికేషన్స్ రౌండ్లో మొత్తంగా ఎనిమిది పెనాల్టీ పాయింట్లను సాధించాడు. 47.20 స్కోర్తో ఫైనల్స్కు అర్హత సాధించాడు.
ఈక్వెస్ట్రియన్ డ్రెస్సింగ్ కేటగిరీలో ఫవాద్ 28.00 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. స్వీడన్కు చెందిన లూయిస్ రొమెకెతో 28 పాయింట్లతో టై అయ్యాడు. ఈ కేటగిరీలో చివరిదైన మూడో రౌండ్లో అతి తక్కువ పెనాల్టీ పాయింట్లు.. డ్రెస్సింగ్లో అధిక పాయింట్లను సాధించాడు. దీనితో 47.20 పాయింట్లు అతని ఖాతాలో పడ్డాయి. దీనితో అతను ఫైనల్స్కు అర్హత సాధించిన తొలి 25 మందిలో నిలిచాడు. ఈ కేటగిరీలో మొత్తం 62 మంది హార్స్ రైడర్లు పాల్గొన్నారు ఈ ఈవెంట్లో.
ఇందులో నుంచి తక్కువ పెనాల్టీ పాయింట్లను సాధించిన తొలి 25 మందిని ఫైనల్స్కు ఎంపిక చేస్తుంది ఒలింపిక్స్ కమిటీ. ఫైనల్స్లో రెండు రౌండ్లలో జంపింగ్స్ ఉంటాయి. ఇందులో రెండో రౌండ్లో అత్యధిక పాయింట్లను సాధించిన వారికి మెడల్ వరిస్తుంది. ఫైనల్స్కు అర్హత పొందిన 25 మందిలో ఫవాద్ మీర్జా ఉన్నాడు. ఈ సాయంత్రం 5:30 గంటలకు ఫైనల్స్ రౌండ్ ప్రారంభమౌతాయి. ఈ రౌండ్లో ఫవాద్ తన సత్తాను చాటుకోవాల్సి ఉంటుంది. 25 మందితో పోటీ పడి టాప్-3లో నిలవాల్సి ఉంటుంది.