సిడ్నీ: శ్రీలంక దిగ్గజ ఆటగాళ్లు కుమార సంగక్కర, మహేల జయవర్ధనేలు రిటైర్మెంట్ ప్రకటించారు. మహేల జయవర్ధనే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించగా, వన్డే క్రికెట్కు సంగక్కర గుడ్ బై చెప్పాడు. ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా బుధవారం సిడ్నీలో జరిగిన క్వార్టర్ ఫైనల్లో దక్షిణాఫ్రికా చేతిలో శ్రీలంక ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.
ఈ మ్యాచులో ఓటమి అనంతరం శ్రీలంక క్రికెట్ను ఎన్నో మ్యాచుల్లో విజయతీరాలకు చేర్చిన దిగ్గజ ద్వయం తమ రిటైర్మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు జయవర్థనే తెలిపాడు. ఇదే సమయంలో వన్డే మ్యాచులకు గుడ్ బై చెబుతున్నట్లు సంగక్కర ప్రకటించాడు. సుదీర్ఘ కాలంపాటు క్రికెట్ ఆడిన ఇద్దరు దిగ్గజాలు వన్డేలకు గుడ్ బై చెబుతూ భారంగా స్టేడియం వీడారు.

404 వన్డేలు ఆడిన సంగక్కర 25 సెంచరీలు, 93 హాఫ్ సెంచరీల సాయంతో 14, 234 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 169 కాగా, బ్యాటింగ్ సగటు 41.98గా ఉంది. ఇక మహేల జయవర్ధనే 448 వన్డేలు ఆడి 19 సెంచరీలు, 77 హాఫ్ సెంచరీల సాయంతో 12,650 పరుగులు చేశాడు. కాగా, ఓ వైపు ప్రపంచ కప్ టోర్నీ నుంచి శ్రీలంక నిష్క్రమించడంతో బాధలో మునిగిపోయిన ఆ దేశ అభిమానులకు, దిగ్గజ ద్వయం రిటైర్మెంట్ మరింద ఆవేదనకు గురి చేసింది.
సంగక్కర, జయవర్ధనేలు లేని శ్రీలంకను ఊహించలేం: సచిన్
శ్రీలంక క్రికెట్ దిగ్గజాలు కుమార సంగక్క, మహేల జయవర్ధనేల రిటైర్మెంట్పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంకకు ఎన్నో ఏళ్లపాటు ప్రాతినిథ్యం వహించడమేగాక, అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్నారని సచిన్ కొనియాడాడు. వారిద్దరూ లేని శ్రీలంక జట్టును ఊహించడం కష్టమని ఫేస్బుక్ అభిప్రాయపడ్డాడు. సంగక్కర, జయవర్ధనేలకు శుభాకాంక్షలు తెలిపాడు. రంగుల దుస్తుల్లో మీరిద్దరూ ఇన్నింగ్స్ నిర్మించే అద్భుతాన్ని కోల్పోతున్నందుకు బాధగా ఉందని తెలిపాడు.