ఫానెక్స్: బాక్సింగ్ లెజెండ్ మహ్మద్ అలీ (74) కన్నుమూశారు. ప్రపంచ హెవీవెయిట్ మాజీ ఛాంపియన్ అయిన అలీ గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఆయన్ని ఆమెరికాలోని ఫానెక్స్లో గల ఏరిజోనా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వారం రోజుల క్రితం చేర్చారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతు శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆల్టైమ్ గ్రేట్ బాక్సర్లలో ఒకరిగా నిలిచిన మహ్మద్ అలీ కొన్ని గంటల ముందు బతికే అవకాశాలు చాలా తక్కువని కుటుంబ సభ్యుల తరుపున అధికారి ప్రతినిధి బాబ్ గున్నిల్ తెలిపారు.

మహ్మద్ అలీ అసలు పేరు కాషియస్ క్లే. 12వ ఏట బాక్సింగ్లో శిక్షణ ప్రారంభించిన అలీ 22 ఏళ్లకే ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ టైటిల్ సాధించారు. 1964లో దిగ్గజ బాక్సర్ సోనీలిస్టన్పై గెలుపుతో ప్రపంచ ఛాంపియన్గా మహ్మద్ అలీ నిలిచారు. తర్వాత ఆయన ఇస్లాం మతం స్వీకరించి మహ్మద్ అలీగా పేరు మార్చుకున్నారు.
బాక్సింగ్లో గొప్ప ఛాంపియన్గా పేరొందినప్పటికీ ఆయన కెరీర్ వివాదాస్పదంగా కొనసాగింది. 1967లో అమెరికా-వియత్నాం యుద్ధ సమయంలో అలీని అమెరికా ఆర్మీలో పనిచేయడానికి ఎంపిక చేసుకున్నారు. కానీ అలీ దీనిని తిరస్కరించారు. శక్తివంతమైన అమెరికా కోసం పేద ప్రజలపై పోరాడనని తేల్చి చెప్పారు.
ఐదేళ్ల జైలుశిక్ష కూడా అనుభవించారు. 20వ శతాబ్దంలో ప్రపంచ బాక్సింగ్కు అలీ ద్వారానే మంచి గుర్తింపు వచ్చింది. బాక్సింగ్ ప్రపంచాన్ని తిరుగులేకుండా ఏలారు. మహా మహా యోధులనే ఆయన తన చేతులతో మట్టి కరిపించారు. అభిమానులు ముద్దుగా 'ది గ్రేటెస్ట్'గా పిలుచుకునే మహ్మద్ అలీ 1981లో రిటైరయ్యారు.
ప్రపంచ బాక్సింగ్లో రికార్డు స్థాయిలో 56 విజయాలు నమోదు చేసి, కేవలం ఐదు పరాజయాలతో తన బాక్సింగ్ కెరీర్ను ముగించారు. 1964, 1974, 1978ల్లో మూడుసార్లు హెవీవెయిట్ టైటిల్ను సాధించారు. మహ్మాద్ అలీ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన భార్య లోన్నీ. ఆయనకు మొత్తం 9 మంది సంతానం.
మహ్మద్ అలీ కూతురైన లైలా తండ్రి అడుగుజాడల్లోనే బాక్సింగ్ కెరీర్ను ఎంచుకుంది. 2005లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ మహ్మద్ అలీని అత్యున్నత అమెరికా పౌరపురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్తో సత్కరించారు. తన జీవితగాథపై పలు పుస్తకాలు కూడా రచించారు.
ది గ్రేటెస్ట్, మై ఓన్ స్టోరీ, ది సోల్ ఆఫ్ ఎ బట్టర్ప్లె పుస్తకాలను అలీ రచించారు. బాక్సింగ్ క్రీడ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మహ్మద్ అలీ ఎక్కువగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఆయన ఆరోగ్యం సహకరించక పోవడంతో గత కొన్నాళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు.
చివరిసారిగా ఈ ఏడాది ఏప్రిల్లో అరిజోనాలో ఓ ఛారిటబుల్ ఆర్గనైజేషన్ కోసం విరాళాలు సేకరించేందుకు గాను అభిమానులకు కనిపించారు. మహ్మద్ అలీ మృతితో ఆయన అభిమానులంతా శోకసముద్రంలో మునిగిపోయారు. ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.