హైదరాబాద్: భారత యువ షూటర్ ఎలవెనిల్ వలరివన్ అంతర్జాతీయ వేదికపై మరోమారు సత్తా చాటింది. జర్మనీలోని సల్ సిటీలో జరుగుతున్న జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్లో స్వర్ణ పతకంతో మెరిసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్స్లో ఎలవెనిల్ 251.7 పాయింట్లు స్కోరుతో చాంపియన్గా నిలిచి స్వర్ణ పతకం అందుకుంది.
మరోవైపు చైనా షూటర్ జెరు వాంగ్కు రజతం, చైనీస్ తైపీకి చెందిన యింగ్ షిన్ లిన్కు కాంస్య పతకాలు దక్కించుకున్నారు. తమిళనాడులో జన్మించిన ఎలవెనిల్ ప్రస్తుతం గుజరాత్లోని అహ్మదాబాద్లో నివాసం ఉంటోంది. 18 ఏళ్ల ఎలవెనిల్కు ఇది రెండో ప్రపంచకప్ పసిడి పతకం కావడం విశేషం.
630.5 పాయింట్లతో ఫైనల్ రౌండ్కు ఎలవెనిల్ అర్హత సాధించింది. ఇదే విభాగంలో పోటీపడ్డ మరో భారత షూటర్ మెహులీ ఘోష్ ఆరో స్థానంలో నిలిచి నిరాశపరిచింది. ఇక, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లోనూ సత్తాచాటుతూ శ్రేయా అగర్వాల్, జీనా ఖిట్టాతో కలిసి ఎలవెనిల్ కాంస్య పతకం సాధించింది.
ఫైనల్స్లో భారత త్రయం 187.1 స్కోరు చేసి మూడోస్థానంలో నిలిచింది. చైనా జట్టుకు స్వర్ణం, సింగపూర్కు రజతం దక్కాయి. మొత్తంగా ఈ టోర్నీలో భారత్ మూడు స్వర్ణాలు, ఓ రజతం, మూడు కాంస్య పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.