చాలా సంతోషంగా ఉంది
అనంతరం ద్యుతీ చంద్ మీడియాతో మాట్లాడుతూ "ఈ రోజు కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. నా ఆనందాన్ని ఎలా తెలపాలో కూడా తెలియడం లేదు. ఎట్టకేలకు నేనుపడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. అర్హత మార్కు అందుకోవడంలో విఫలమవ్వడంతో ఈ ఏడాది గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనలేకపోయా" అని పేర్కొంది.
ఎంతో బాధపడ్డా
"ఎంతో బాధపడ్డా. పురుష హార్మోన్లు అధికంగా ఉన్నాయంటూ 2014 గ్లాస్గోలో నిర్వహించిన కామన్వెల్త్ గేమ్స్లో నన్ను పాల్గొననివ్వలేదు. ఇప్పుడేమో అర్హత మార్కు అందుకోలేక బరిలోకి దిగలేకపోయా. నా కోచ్ రమేశ్ సర్ నాతో ఆసియా గేమ్స్కు సిద్ధం అవ్వు. తప్పకుండా పతకాలు సాధిస్తావ్ అన్నారు. మొదట నమ్మలేదు. కానీ ఆ తర్వాత బాగా కష్టపడ్డా" అని ద్యుతీ చంద్ తెలిపింది.
ఆరు సార్లు ట్రైనింగ్ సెషన్లో పాల్గొనేదాన్ని
"ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రమం తప్పకుండా ఆరు సార్లు ట్రైనింగ్ సెషన్లో పాల్గొనేదాన్ని. సుమారు నాలుగు నెలల పాటు నా దిన చర్య ఇదే. నేను ఇన్నాళ్లు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అందుకున్నా. చాలా సంతోషంగా ఉంది" అని ద్యుతీ చంద్ తెలిపింది.
అప్పుడు ఎంతో కుంగిపోయా
"నా శరీరంలో పురుష హార్మోన్లు అధికంగా ఉన్నాయని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ వేటు వేయడం నన్నెంతో ఆవేదనకు గురి చేసింది. దీంతో నన్ను భారత జట్టు నుంచి తప్పించారు. అంతేకాదు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) నన్ను హాస్టల్లోకి అనుమతించలేదు. ఇదంతా చూసి ఎంతో కుంగిపోయాను. ఆ తర్వాత ధైర్యంగా పోరాడాను. ఆర్బిట్రేషన్ కోర్టులో కేసు వేసి గెలిచాను" అని ద్యుతీ చంద్ పేర్కొంది.
పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ
"ఆ తర్వాత, హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందాను. ఆసియా గేమ్స్కు అర్హత సాధించాను. ఇప్పుడు రెండు పతకాలు గెలిచాను. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేను పతకాలు గెలిచినందుకుగాను ప్రైజ్ మనీ ప్రకటించారు. ముందుగా ఈ డబ్బుతో నా ఇంటిని బాగుచేసుకుంటాను. త్వరలో టోక్యో ఒలింపిక్స్ కోసం ట్రైనింగ్ మొదలుపెడతాను. ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించడమే నా లక్ష్యం" అని ద్యుతీ చంద్ తెలిపింది.