
హైదరాబాద్: భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతి చంద్ కొత్త సీజన్లో శుభారంభం చేసింది. స్వదేశీ అథ్లెట్ల మధ్య నిర్వహిస్తున్న ఇండియన్ గ్రాండ్ప్రి-1 అథ్లెటిక్స్ మీట్లో ఒడిశా స్టార్ క్రీడాకారిణి ద్యుతీచంద్ స్వర్ణ పతకాన్ని సాధించింది. ఇండియన్ గ్రాండ్ప్రి అథ్లెటిక్స్లో ద్యుతి సత్తాచాటింది. మంగళవారం జరిగిన 100 మీ పరుగును ద్యుతి 11.57 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణం కైవసం చేసుకుంది.
ఈమెతో పాటుగా లాంగ్ జంప్లో పూర్ణిమా హెంబ్రమ్ 5.99మీటర్లు దూకి రజిత పతకాన్ని గెలుచుకుంది. కాగా, ద్యుతీచంద్ భువనేశ్వర్లోని కేఐఐటీ యూనివర్విటీ స్టూడెంట్, పూర్ణిమా హెంబ్రమ్ అక్కడే కేఐఎస్ఎస్ యూనివర్సిటీ స్టూడెంట్. ప్రస్తుతం ద్యుతీచంద్ తెలంగాణకు చెందిన కోచ్ నాగపురి రమేశ్ వద్ద శిక్షణ తీసుకుంటోంది.
ఇదే మీట్లో పురుషుల జావెలిన్ త్రోలో ఆసియా చాంపియన్ నీరజ్ చోప్రా పసిడి పతకం గెలిచాడు. హిమదాస్(11.74 సె), రజీనా ప్రకాశ్(11.76సె) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. మరోవైపు పురుషుల 100మీటర్ల రేసులో రాష్ర్టానికి చెందిన సుధాకర్ యాదవ్(10.71 సె) కాంస్య పతకంతో ఆకట్టుకున్నాడు.
ఇదే పోటీలో విద్యసాగర్(10.65సె), అనురూప్ జాన్(10.70సె) స్వర్ణ, రజత పతకాలు దక్కించుకున్నారు. జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా 82.88 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకంతో సత్తాచాటాడు. ఇదే పోటీలో విపిన్ కసాన(80.04మీ) రజతం దక్కించుకోగా, అమిత్కుమార్(77.33మీ) కాంస్య పతకం సాధించాడు. దాదాపు మూడు నెలల తర్వాత బరిలోకి దిగిన నీరజ్..ప్రత్యర్థులను అలవోకగా అధిగమిస్తూ టాప్లో నిలిచాడు.