ద్యుతీ బంధాన్ని ఒప్పుకోము:
ద్యుతీ బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని ద్యుతీ తల్లి అఖోజీ చంద్ స్పష్టం చేసింది. ద్యుతీ సోదరి సరస్వతి కూడా అమ్మాయితో సంబంధానికి అంగీకరించలేదు. మరోవైపు భయపెట్టడం, బ్లాక్మెయిల్ (రూ.25లక్షలు ఇవ్వాలని) చేయడం వంటివి సరస్వతి చేసిందని ద్యుతీ ఆరోపణలు చేసింది. ఈ అంశంపై మంగళవారం ద్యుతీ మీడియాతో మాట్లాడింది.
డబ్బులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేసింది:
'అడిగినప్పుడల్లా డబ్బులివ్వలేదని మా అక్క నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. రూ. 25 లక్షలు ఇవ్వాలని నన్ను అడిగింది. డబ్బులు ఇవ్వకపోవడంతో కొట్టింది. ఈ విషయంపై నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. అయినా ఇప్పటికీ మా అక్క బెదిరిస్తూనే ఉంది. దీంతోనే నేను నా బంధాన్ని బయటికి చెప్పాను' అని ద్యుతీ తెలిపింది.
మా అమ్మ మాటల్లో వాస్తవం లేదు:
'నా కుటుంబానికి ఆర్థికంగా సాయం చేయడం లేదంటూ మా అమ్మ చెప్పిన మాటల్లో అసలు వాస్తవం లేదు. నా బాధ్యతలేంటో నాకు తెలుసు. వారికోసం ఎంత చేయాలో అంత చేస్తున్నా.. వారికి అండగా నిలబడ్డా. అయినా వారు నన్ను చాలా రకాలుగా వేధిస్తున్నారు. నా బంధం గురించి బయట తెలిస్తే పరుగుపై దృష్టిసారించలేనని అక్క నన్ను బెదిరించింది. ఇవన్ని భరించలేక నేను నా బంధం గురించి అందరికి చెప్పాను' అని ద్యుతీ తెలిపారు.
ఆమెతోనే నా జీవితం:
'తమకు నచ్చిన వ్యక్తిని ప్రేమించే, వారితో జీవితాన్ని పంచుకునే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుంది. స్వలింగ సంపర్కుల హక్కులు కాపాడేందుకు నేను ఎప్పుడు మద్దతుగా ఉంటా. ప్రేమను తప్పుబట్టే హక్కు ఎవరికీ లేదు. నాకు జీవిత భాగస్వామి దొరికింది. నేను టీనేజ్ అమ్మాయితో సహజీవనం చేస్తున్నా. ఆమె నా బంధువు. మా ఊర్లోనే ఉంటుంది. భువనేశ్వర్ కాలేజిలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. నేనెప్పుడు ఊరెళ్లినా ఆమెతోనే గడుపుతాను. ఆమెతోనే నా జీవితం ముడిపడుతుంది' అని ద్యుతీ ఇంతకుముందు తెలిపింది.