హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న కబడ్డీ వరల్డ్ కప్ టోర్నమెంట్కు దుబాయి వేదికగా ఖాయమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దుబాయిలో కబడ్డీ మాస్టర్స్ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆరు దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్ జూన్ 29తో ముగియనుంది.
ఈ టోర్నీ ముగిసిన తర్వాత దుబాయ్లో అంతర్జాతీయ కబడ్డీ సంఘం (ఐకేఎఫ్) సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వచ్చే ఏడాది జరగనున్న కబడ్డీ వరల్డ్ కప్ టోర్నమెంట్పై కీలక నిర్ణయం తీసుకుంటామని ఐకేఎఫ్ అధ్యక్షుడు జనార్దన్ సింగ్ గెహ్లాట్ తెలిపారు.
2019లో జరిగే కబడ్డీ వరల్డ్ కప్ను నిర్వహించేందుకు వేదికగా ఏ నగరాన్ని ఎంపిక చేయాలో ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశం గురించి జనార్దన్ సింగ్ గెహ్లాట్ మాట్లాడుతూ "ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్లన్నీ భారత్ వేదికగా జరిగాయి. ప్రపంచమంతా ఆటను విస్తరించే పనిలో భాగంగా కొత్త వేదికను ప్రపంచకప్ ఆతిథ్య దేశంగా ఎంపిక చేస్తాం" అని అన్నారు.
అయితే, దుబాయిను వేదికగా ఎంపిక చేస్తున్నట్లు స్పష్టం చేయాలన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. వరల్డ్ కప్కు ఏ నగరాన్ని ఎంపిక చేయాలనే దానిపై అధికారిక సమావేశం నిర్వహించిన తర్వాత మాత్రమే అధికారికంగా ప్రకటిస్తామని జనార్దన్ సింగ్ చెప్పారు.
అర్జెంటీనా కబడ్డీ ఫెడరేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ కబడ్డీ వరల్డ్ కప్కు ఆతిథ్యమిచ్చే నగరాల్లో దుబాయి ముందంజలో ఉందని అన్నారు. అంతేకాదు వచ్చే ఏడాది కబడ్డీ వరల్డ్ కప్లో లాటిన్ అమెరికాకు చెందిన మూడు జట్లు పాల్గొంటాయని అన్నారు.
2004లో మొట్టమొదటిసారి ముంబై వేదికగా కబడ్డీ వరల్డ్ కప్ను నిర్వహించారు. ఆ తర్వాత 2007లో రెండో ఎడిషన్ జరిగింది. చివరిసారిగా జరిగిన కబడ్డీ వరల్డ్ కప్లో కెన్యా, అర్జెంటీనాతో సహా మొత్తం 12 దేశాలు పాల్గొన్నాయి. మూడో ఎడిషన్ కబడ్డీ వరల్డ్ కప్ అహ్మదాబాద్ వేదికగా జరిగింది.