బుడాపెస్ట్ వేదికగా జరిగిన చెస్ ఒలింపియాడ్లో భారత్ రెండు స్వర్ణాలతో అదరగొట్టింది. భారత పురుషుల, మహిళల చెస్ జట్లు సత్తాచాటి ఈ 45వ చెస్ ఒలింపియాడ్లో పసిడి సాధించాయి. ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత్ స్వర్ణాలు గెలవడం ఇదే తొలిసారి. అంతకుముందు 2014, 2022లో పురుషుల జట్లు, 2022లో మహిళల జట్టు కాంస్యాలు గెలవడమే అత్యుత్తమ ప్రదర్శన.
ఆదివారం జరిగిన చివరి రౌండ్ (11)లో రెండో సీడ్ భారత పురుషుల జట్టు స్లోవేనియాను 3.5-0.5తో ఓడించింది. శనివారం పదో రౌండ్ ముగిసేసరికే పురుషుల జట్టుకు పసిడి ఖాయమైంది. స్లొవేనియాతో చివరి రౌండ్ను డ్రా చేసినా బంగారు పతకం వచ్చేది. కానీ భారత్ విజయఢంకా మోగించింది.జాన్ సుబేజ్పై తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేసి 49 ఎత్తుల్లో గెలిచాడు. వ్లాదిమిర్ ఫెడోసీవ్ను గుకేష్ఓడించాడు. దీంతో స్వర్ణం ఖాయమైంది.

ఇక మిగిలిన నామమాత్రమైన మిగిలిన రెండు గేమ్ల్లో ఆంటన్ డెమ్చెన్కోపై ప్రజ్ఞానంద గెలిచిడాడు. మటేజ్ సెబెనిక్తో విదిత్ డ్రా చేసుకున్నాడు. భారత్ ఓటమి ఎరుగకుండా 22 పాయింట్లకుగాను 21 పాయింట్లతో గోల్డ్ సాధించింది. అమెరికా రజతం, ఉజ్బెకిస్థాన్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాయి. అమెరికా, ఉజ్బెకిస్థాన్ చెరో 17 పాయింట్లతో సమంగా నిలిచాయి. కానీ మెరుగైన టైబ్రేకర్ స్కోరుతో అమెరికాకు రజతం దక్కింది.
మరోవైపు భారత మహిళల జట్టు గొప్పగా సత్తాచాటింది. పసిడి దక్కాలంటే తప్పక విజయం సాధించాల్సిన పోరులో అజర్బైజాన్పై 3.5-0.5తో గెలిచింది. గోవార్పై దివ్య 39 ఎత్తుల్లోనే గెలిచింది. ఉల్వియాతో గేమ్ను వైశాలి డ్రా చేసుకుంది. మమ్మాద్జాదాపై 51 ఎత్తుల్లో హారిక నెగ్గింది. చివరిగా ఖానిమ్ను 53 ఎత్తుల్లో వంతిక ఓడించింది. కజకిస్థాన్ (18) రజతం, అమెరికా (17) కాంస్య పతకం అందుకున్నాయి. ఆఖరి రౌండ్లో పరస్పరం తలపడిన కజకిస్థాన్-అమెరికా డ్రా చేసుకోవడంతో భారత్ (19) మహిళలకు స్వర్ణం దక్కింది.