
హైదరాబాద్: కామన్వెల్త్ క్రీడల్లో సత్తా చాటిన భారత్కు ఇది దిగ్భ్రాంతి కలిగించే పరిణామమే. డోపింగ్ భూతం మళ్లీ భారత వెయిట్లిఫ్టింగ్ను పట్టుకుంది. గోల్డ్కోస్ట్ క్రీడల్లో స్వర్ణం సాధించిన సంజిత చాను (53 కేజీ) డోప్ పరీక్షల్లో విఫలమైంది. నిషిద్ధ ఉత్ప్రేరకం వాడినట్లు పరీక్షల్లో తేలడంతో చానుపై ప్రాథమిక సస్పెన్షన్ విధించినట్లు అంతర్జాతీయ వెయిట్లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) తెలిపింది.
'చాను శరీరంలో టెస్టొస్టెరోన్ చాలా ఎక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. డోపింగ్ నిరోధ నిబంధనలను ఉల్లంఘించి ఉండొచ్చన్న ఉద్దేశంతో ఆమెపై ప్రాథమికంగా సస్పెన్షన్ విధించాం' అని ఐడబ్లూఎఫ్ తన వెబ్సైట్లో పేర్కొంది.
'సంజీత చాను నుంచి సేకరించిన శాంపుల్స్లో నిషిద్ధ ఉత్ప్రేరకాలు (టెస్టోస్టిరాన్) వాడినట్లు రుజువైంది. యాంటీ డోపింగ్ రూల్స్ ప్రకారం ఇది నేరం. ఒకవేళ ఆమె డోపింగ్ నిరోధక నియమాలను ఉల్లంఘించలేదని నిరూపితమైతే... సంబంధిత నిర్ణయాన్ని కూడా తిరిగి ప్రకటిస్తాం' అని ఐడబ్ల్యూఎఫ్ తెలిపింది.
నిరుడు నవంబరులో అనాహీమ్ (అమెరికా)లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో చాను.. 177 కిలోలతో 13వ స్థానం సాధించింది. ఆ టోర్నీకి ముందు తీసుకున్న 'ఎ' శాంపిల్ పరీక్ష్లలోనే చాను విఫలమైంది. ఐతే ఇంత ఆలస్యంగా ఫలితాలను ఎందుకు ప్రకటించారో తెలియదు.
కామన్వెల్త్ క్రీడలు ముగిసిన తర్వాత కూడా అంతర్జాతీయ సమాఖ్య బృందం లిఫ్టర్ల దగ్గర నమూనాలు తీసుకుంది. 'బి' శాంపిల్లోనూ విఫలమైతే చానుపై గరిష్టంగా నాలుగేళ్ల నిషేధం పడే అవకాశముంటుంది. ఆమె కామన్వెల్త్ స్వర్ణాన్ని కూడా వెనక్కి తీసుకుంటారు. హిమాచల్ప్రదేశ్లోని షిలారూ సాయ్ సెంటర్లో ఉన్న సంజిత చానును శిబిరం విడిచి వెళ్లిపోవాలని భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య ఆదేశించినట్లు సమాచారం. ఈ అంశంపై స్పందించేందుకు భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య అధికారులు అందుబాటులో లేరు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లోని జాతీయ క్యాంపులో శిక్షణ తీసుకుంటున్న చాను ఈ నిర్ణయంతో క్యాంపు వదిలి స్వస్థలమైన మణిపూర్కు పయనమైంది.