
బెంగళూరు: టోక్యో ఒలింపిక్స్ 2021కు వెళ్లే భారత హాకీ జట్లకు దిగ్గజ క్రీడాకారుడు ధన్రాజ్ పిళ్లై పలు సూచనలు చేశారు. పతకం దృష్టిలో పెట్టుకొని ఆడొద్దని, ఒక్కో మ్యాచు ఆడుతూ ముందుకెళ్లాలని పురుష, మహిళా జట్లకు సూచించారు. ఒలింపిక్స్లో భారత హాకీ జట్లు పతకం తీసుకొస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అత్యంత ఫిట్నెస్తో ఉండటమే పురుషుల జట్టు బలమని పేర్కొన్నారు. ఐదేళ్లుగా రెండు జట్లూ రాణిస్తున్నాయని ధన్రాజ్ పిళ్లై ప్రశంసించారు. కరోనా మహమ్మారి ప్రభావంతో దాదాపు ఏడాదిన్నర పాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ ఈ నెల 23న ప్రారంభం కానున్నాయి. మంగళవారం ఒలింపిక్స్ గ్రామాన్ని నిర్వాహకులు తెరిచారు.
తాజాగా హాకీ దిగ్గజ క్రీడాకారుడు ధన్రాజ్ పిళ్లై మాట్లాడుతూ... 'గత ఐదు సంవత్సరాలుగా భారత హాకీ జట్లు (పురుష, మహిళా) బాగా ఆడుతున్నాయి. దేహదారుఢ్యమే వారి బలం. మా రోజుల్లో ఇలాంటి అండదండలు లేవు. ఇప్పటికే పురుషుల జట్టు అద్భుతాలు చేసింది. 2016, 2018 ఛాంపియన్స్ ట్రోఫీ.. ప్రపంచ లీగ్ ఫైనల్స్ (2015, 2017) ఫలితాల్లో ఆకట్టుకుంది. ఈ ఒలింపిక్స్లో వారు తప్పక రాణిస్తారు. పతకం తీసుకొస్తారని నాకు నమ్మకం ఉంది' అని అన్నారు.
రెండు హాకీ జట్ల సారథులు మన్ప్రీత్ సింగ్, రాణి రాంపాల్కు ధన్రాజ్ పిళ్లై స్వయంగా లేఖలు రాశారు. 'నేనూ బెంగళూరులోనే ఉండటంతో హాకీ క్రీడాకారులను కలుద్దామని భావించా. కానీ కరోనా వైరస్ నిబంధనల వల్ల నేరుగా కలవలేకపోయా. అందుకే ప్రత్యేకంగా లేఖలు రాశా. ఒలింపిక్ క్రీడా గ్రామంలో ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించా. క్రీడా జీవితంలోనే అద్భుతమైన ఈ సందర్భాన్ని ప్రశాంతంగా, ఆనందంగా గడపాలని కోరాను' అని ధన్రాజ్ పేర్కొన్నారు. 'పతకం దృష్టిలో పెట్టుకొని ఆడొద్దని రెండు జట్లకు సూచిస్తున్నా. ఒక్కో మ్యాచు ఆడుతూ ముందుకెళ్లాలి. ఆఖరి రోజు వరకు ఒక బృందంగా ముందుకు సాగాలి' అని ఆయన సూచించారు.
ఇక నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్ క్రీడల కోసం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కానీ ఈసారి మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. కరోనా మహమ్మారితో పాటు హైప్రొఫైల్ అథ్లెట్లు ఈసారి టోర్నీకి దూరంగా ఉండటంతో.. టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్పై ఎవరూ ఆసక్తి చూపడం లేదని తాజా సర్వే తేల్చింది. ఇప్సోస్ అనే సంస్థ 28 దేశాల్లో ఈ సర్వే నిర్వహించింది. కేవలం 46 శాతం మందికి మాత్రమే గేమ్స్పై ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొంది. క్రీడలు జరిగే జపాన్లో అయితే కేవలం 35 శాతం మంది మాత్రమే ఒలింపిక్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారట.