లాస్ వెగాస్: ఇటీవల జరిగిన, బాక్సింగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బౌట్.. ఫ్లాయిడ్ మేవెదర్, మానీ పకియావ్ మధ్య జరగగా, ఇందులో మేవెదర్ విజయం సాధించారు. ఇందులో విజయం సాధించిన మేవెదర్ నిమిషానుకు రూ.31 కోట్లు సంపాదించాడు.
ఈ బాక్సింగ్ మ్యాచ్ ద్వారా మేవెదర్ రూ.1,145 కోట్లు సంపాదించాడు. ఈ మ్యాచ్ ద్వారా వచ్చిన మొత్తంలో ఇది అరవై శాతం. మ్యాచ్ ద్వారా మొత్తం రూ.1,911 కోట్లు వచ్చాయి. ఓడిపోయిన పకియావ్ కూడా రూ.763 కోట్లు పొందాడు.

ఇదిలా ఉండగా, మేవెదర్తో ప్రతిష్టాత్మక బౌట్లో పకియావ్ జడ్జిల చేతిలోనే ఓడిపోయాడని కంబోడియా ప్రధాని హున్ సేన్ ఆరోపించాడు. తమ దేశస్థుడైన మేవెదర్ కోసం జడ్జిలు పక్షపాతంతో వ్యవహరించారని, పకియావ్ గెలుస్తాడని తాను కట్టిన 5వేల డాలర్ల పందెం డబ్బులు కూడా ఇవ్వనని చెప్పాడు.
పకియావ్ పదేపదే పంచ్లు విసురుతుంటే, మేవెదర్ రింగులో తప్పించుకొని తిరగడానికే చూశాడని, జడ్జీలు ఇంత బలహీనులు అనుకోలేదని, అమెరికా అంటే ఏంటో నాకిప్పుడు తెలిసిందని చురకలు అంటించాడు. ఓ విజేతను పరాజితుడిగా జడ్జీలు ఏకగ్రీవంగా నిర్ణయించడం సరికాదన్నారు. తాను కాసిన పందెం డబ్బులు చెల్లించే ప్రసక్తి లేదన్నాడు.