Chess World Cup: భారత యువ చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్ ఫిడే మహిళల ప్రపంచ కప్ ఫైనల్కు చేరుకుని చరిత్ర సృష్టించింది. ఆమె సెమీఫైనల్ మ్యాచ్లో మాజీ ప్రపంచ ఛాంపియన్ తాన్ ఝోంగీని 1.5-0.5 తేడాతో ఓడించింది. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఫైనల్కు చేరిన మొదటి భారతీయ మహిళగా దివ్య దేశ్ముఖ్ చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో ఆమె తన మొదటి గ్రాండ్ మాస్టర్ నార్మ్ను కూడా సాధించింది. 19 ఏళ్ల దివ్య తెల్లపావులతో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. దీంతో పాటు ఆమె 2026 మహిళల క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది.
ప్రపంచ నంబర్ 18 అయిన దివ్య మొదటి సెమీఫైనల్లో నల్లపావులతో ఆడి డ్రా చేసుకుంది. రెండో గేమ్లో ఆమెకు తెల్లపావులతో ఆడటం ప్రయోజనకరంగా మారింది. ఆమె మిడ్ గేమ్లో తాన్ ఝోంగీ చేసిన తప్పులను సొమ్ముగా మార్చుకుంది. దివ్య తన నైపుణ్యాన్ని విజయంగా మార్చుకుంది. ఈ గెలుపు భారత మహిళా చెస్కు గొప్ప విజయం.

టై బ్రేకర్ ఆడనున్న కోనేరు హంపి
ఇదిలా ఉండగా.. గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి రెండో సెమీఫైనల్ చైనాకు చెందిన లీ టింగీతో డ్రా అయింది. ఇప్పుడు ఆమె టై-బ్రేక్ ఆడవలసి ఉంటుంది. హంపికి తెల్లపావులు ఉన్నప్పటికీ, ఆమె లీ టింగ్జీ బలమైన రక్షణను ఛేదించలేకపోయింది. ఇప్పుడు ఈ ఇద్దరు క్రీడాకారిణులు గురువారం రాపిడ్, బ్లిట్జ్ టై-బ్రేక్ గేమ్స్ ఆడతారు. దీని ద్వారా ఫైనల్లో రెండో స్థానం ఎవరికి లభిస్తుందో తెలుస్తుంది.
ఈ టోర్నమెంట్ సెమీఫైనల్స్లో ఇద్దరు భారతీయ క్రీడాకారిణులు ఉన్నారు. దివ్య దేశ్ముఖ్ ఫైనల్కు చేరుకునే క్రమంలో అనేక గొప్ప క్రీడాకారిణులు ఓడించింది. దివ్య నిర్భయంగా, దూకుడుగా చెస్ ఆడింది. తాన్ ఝోంగీ తన బలమైన ఆటతీరుకు ప్రసిద్ధి చెందింది. దివ్య ఆమెను ఓడించి మహిళా చెస్లో తాను ఒక కొత్త స్టార్ అని నిరూపించుకుంది.