
హైదరాబాద్: భారత స్టార్ డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ అథ్లెట్లిక్స్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గత పదిహేనేళ్లుగా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ దేశానికి ఎన్నో పతకాలు తెచ్చిన అతడు బుధవారం ఆటకు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు భారత అథ్లెటిక్ సమాఖ్య (ఏఎఫ్ఐ)కు లేఖ రాశాడు.
దీనిని ఏఎఫ్ఐ ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించింది. 6 అడుగుల 9 అంగుళాల ఎత్తు ఉండే వికాస్ గౌడ కామన్వెల్త్ క్రీడల్లో డిస్కస్ త్రోలో స్వర్ణం పతకం సాధించిన ఏకైక భారత ఆటగాడు. అంతేకాదు భారత్ తరుపున వరుసగా నాలుగు ఒలింపిక్స్ల్లో (2004, 2008, 2012, 2016) వహించాడు.
స్వదేశంలో 2010లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో రజతం నెగ్గిన వికాస్ గౌడ 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఇక, 2012 లండన్ ఒలింపిక్స్లో ఫైనల్ రౌండ్కు అర్హత సాధించడం అతడి అత్యుత్తమం. ఆసియా క్రీడల్లోనూ వికాస్ గౌడ రికార్డు గొప్పగానే ఉంది. 2013, 2015 ఆసియా ఛాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గాడు.
2010 ఆసియా క్రీడల్లో కాంస్యం, 2014 ఆసియా క్రీడల్లో రజతం సొంతం చేసుకున్నాడు. డిస్కస్ త్రోలో జాతీయ రికార్డు (66.28 మీటర్లు) అతడి పేరిటే ఉంది. 2012లో ఆ రికార్డు సాధించాడు. గతేడాది భువనేశ్వర్లో జరిగిన ఆసియా చాంపియన్షిప్లో కాంస్యం సాధించిన అనంతరం వికాస్, ప్రధాన ఈవెంట్లలో బరిలోకి దిగలేదు.
ఆసియా క్రీడలకు ముందు గౌడ రిటైర్మెంట్ ప్రకటించడం అందరికీ ఆశ్చర్యపరిచింది. 2017లో భారత ప్రభుత్వం వికాస్కు పద్మశ్రీ అవార్డును బహుకరించింది. మాజీ అథ్లెట్ అయిన అతడి తండ్రి శివ్.. 1988 ఒలింపిక్స్లో జాతీయ కోచ్గా సేవలందించాడు. జులై 5వ తేదీన 35 ఏళ్లు పూర్తి చేసుకోనున్న వికాస్ మైసూర్లో జన్మించి అమెరికాలో స్థిరపడ్డాడు.