
హైదరాబాద్: వింటర్ ఒలింపిక్స్ కొరియన్ల మధ్య చక్కటి వాతావరణాన్ని నెలకొల్పుతోంది. అంతేకాదు ఆ రెండు దేశాల మధ్య ఉన్న శుత్రుత్వాన్ని కూడా మార్చేసింది. 23వ వింటర్ ఒలింపిక్స్కు దక్షిణ కొరియాలోని ప్యాంగ్ నగరం ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ఉత్తర కొరియా అధికారులపై విధించిన ఆంక్షలను ఐక్యరాజ్య సమితి సడలించింది.
అంతేకాదు, ఉత్తరకొరియా దేశాధ్యక్షుడు కిమ్ చెల్లెలు కిమ్ యో జాంగ్, ఉత్తర కొరియా క్రీడా మార్గదర్శక కమిటీ చైర్మన్ చో వెయ్ తదితరులు దక్షిణ కొరియాకు వెళ్లేందుకు అనుమతి కూడా ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పలువురు అధికారులతో కలిసి కిమ్ యో జాంగ్ శుక్రవారం ఉదయం ప్యాంగ్ చాంగ్ చేరుకుంది.
విమానాశ్రయంలో దక్షిణ కొరియా అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె శుక్రవారం సాయంత్రం వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ పక్కనే కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ కూర్చున్నారు.
ప్రారంభోత్సవ వేడుకల్లో ఉత్తర, దక్షిణ కొరియా అథ్లెట్లు ఒకే జాతీయ జెండాతో కలిసి కవాతులో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జయే ఇన్, అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తదితరులు స్టాండ్స్లో కూర్చొని ఈ కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సమయంలో కిమ్ సోదరి చప్పట్లు చరిచారు.
ప్రారంభోత్సవ వేడుకలు అనంతరం శనివారం ఉదయం దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేను రాజధాని సియోల్లో కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్ కలుసుకున్నారు. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో ఈ చరిత్రాత్మక భేటీ జరిగింది. 1950లో జరిగిన కొరియా యుద్ధం తర్వాత రెండు దేశాల అగ్ర నేతలు భేటీ కావడం ఇదే మొదటిసారి.
ఇదిలా ఉంటే శనివారం రెండు కొరియా దేశాలు ఐస్ హ్యాకీ మ్యాచ్ ఆడనున్నాయి. ఆ మ్యాచ్ను కిమ్ సోదరి ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.