చెన్నై: గత నెల రోజులుగా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన చెన్నై వాసులను ఆదుకొనేందుకు ఒక్కొక్కరిగా ముందుకొస్తున్నారు. తాజాగా చెన్నై వరద బాధితులను ఆదుకోవడానికి భారత స్వాష్ స్టార్ దీపికా పళ్లికల్ ముందుకొచ్చింది.
వరద భాధితులకు అండగా నిలిచేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2 లక్షలు విరాళం ప్రకటించింది. హాంకాంగ్ ఓపెన్ ముగించుకుని శనివారం రాత్రి ముంబైకి చేరుకున్న దీపిక మీడియాతో మాట్లాడుతూ అప్పుడు నేను హాంకాంగ్లో ఉన్నాను. వరదలతో చెన్నై అతలాకుతలమైంది.
భారీ వర్షాలు, వరదలతో ఓ ద్వీపంలా మారిన మహానగరంలో ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు నన్నెంతోగానో బాధకు గురిచేశాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా చిన్న పెద్దా తేడా లేకుండా చెన్నై వాసులు ఒకరికొకరు సహాయపడుతున్నారు. అతిత్వరలో నేను కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటా అని చెప్పింది.