తిరువనంతపురం: కామన్వెల్త్ క్రీడల్లో పతకాన్ని గెలుచుకున్న జిమ్నాస్టు దీపా కర్మాకర్ మరోసారి సత్తా చాటుకుంది. కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న 35వ జాతీయ క్రీడల్లో ఆమె శుక్రవారం ఒకే రోజు ఐదు స్వర్ణ పతకాలు కైవసం చేసుకుని త్రిపురకు 'పసిడి పంట' పండించింది. కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్టుగా చరిత్రకెక్కిన కర్మాకర్ 2011 జాతీయ క్రీడల్లో కనబర్చిన ప్రదర్శనను మరోసారి పునరావృతం చేసింది.
వ్యక్తిగత ఆల్రౌండ్, టేబుల్ వాల్ట్, బ్యాలెన్సింగ్ బీమ్, అన్ ఈవెన్ ప్యార్లల్ బార్స్, ఫ్లోర్ ఎక్సర్సైజ్ విభాగాల్లో పసిడి పతకాలను కైవసం చేసుకుంది. తద్వారా ఆమె ఈ క్రీడల్లో మరోసారి అత్యంత ప్రతిభావంతురాలైన క్రీడాకారిణిగా నిలిచింది. ప్రస్తుత జాతీయ క్రీడల్లో ఇప్పటిదాకా త్రిపురకు పతకాలను అందించిన ఏకైక అథ్లెట్ దీపా కర్మాకరే కావడం మరో విశేషం.
అగ్రస్థానానికి దూసుకెళ్లిన ఎస్ఎస్సిబి
జాతీయ క్రీడల పతకాల పట్టికలో హర్యానా ఆధిపత్యానికి ఎస్ఎస్సిబి (సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు) గండి కొట్టింది. ఇప్పటివరకూ 38 స్వర్ణ, 11 రజత, 12 కాంస్య (మొత్తం 61) పతకాలను కైవసం చేసుకుని అగ్రస్థానానికి దూసుకెళ్లిన ఎస్ఎస్సిబి వరుసగా మూడోసారి ఓవరాల్ టైటిల్ను సాధించే దిశగా సాగుతుండగా, మహారాష్ట్ర 25 స్వర్ణ, 29 రజత, 20 కాంస్య (మొత్తం 74) పతకాలతో ద్వితీయ స్థానానికి ఎగబాకింది. దీంతో ఇప్పటివరకూ మొత్తం 44 (25 స్వర్ణ, 13 రజత, 6 కాంస్య) పతకాలు మాత్రమే సాధించిన హర్యానా మూడో స్థానానికి దిగజారింది.

తెలంగాణకు స్వర్ణకాంతులు
జాతీయ క్రీడల్లో ఐదోరోజు తెలంగాణ పసిడికాంతులు వెదజల్లింది. టోర్నీలో పసిడికొరత తీర్చుతూ రోయింగ్ జట్టు బంగారు బోణీ చేసింది. రోయర్లు అస్రార్ పాటిల్, దేవేందర్సింగ్, మన్జీత్ సింగ్లు తమ విభాగాల్లో విజయదుందుభి మోగించి తెలంగాణకు రెండు స్వర్ణాలు అందించారు. పురుషుల సింగిల్స్ స్కల్స్ -500 మీటర్ల ఈవెంట్లో రాష్ర్టానికి చెందిన అస్రార్ పాటిల్ 1:38.00 సెకన్లలో గమ్యాన్ని చేరి మొదటిస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని అందుకున్నాడు.
పంజాబ్ రోయర్ దల్జీత్ సింగ్, సర్వీసెస్కు చెందిన ఓంప్రకాశ్లు వరుసగా రెండు, మూడుస్థానాలతో రజత, కాంస్య పతకాలను దక్కించుకున్నారు. ఇక పురుషుల కాక్స్వెయిన్ లెస్ పెయిర్-500 మీటర్ల ఈవెంట్లో నిమిషం 32 సెకన్ల టైమింగ్తో లక్ష్యాన్ని అధిగమించిన తెలంగాణకు చెందిన దేవేందర్సింగ్, మన్జీత్సింగ్ జోడీ అందరికంటే ముందంజలో నిలిచి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది.
సర్వీసెస్ జోడీ జగన్ శేఖర్-పాండురంగ మోహిత్ రజతంతో, ఉత్తరాఖండ్ రోయింగ్ ద్వయం జస్వీర్సింగ్, మనీష్ యాదవ్ కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇక బీచ్ వాలీబాల్లో తెలంగాణ రాష్ట్ర జట్టుకు రజతం దక్కింది.