
జకార్తా: రెండేళ్ల ముందు జరిగిన రియో ఒలింపిక్స్ నుంచి దీపా కర్మాకర్ అనే పేరు క్రీడారంగంలో ఓ దివ్వెలా వెలుగుతూనే ఉంది. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్లో తొలిసారి ఒలింపిక్స్కు ఎంపికైన భారత క్రీడాకారిణి.. ప్రాణాంతకమైన ప్రొడునోవా విన్యాసంతో అంతర్జాతీయ మేటి జిమ్నాస్ట్లనే అబ్బురపరిచింది. నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం చేజార్చుకుంది. అయినప్పటికీ అందరి మన్ననలు అందుకుంది.
ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక క్రీడోత్సవంలో పాల్గొన్న దీపా.. అదే స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన ఇస్తుంది. తెలుగమ్మాయి అరుణా బుద్ధారెడ్డి, ప్రణతి నాయక్ వాల్ట్ విభాగంలో తన కన్నా మెరుగైన స్కోరు చేయడంతో వ్యక్తిగత విభాగంలో దీప ఫైనల్ చేరలేకపోయింది. అర్హత పోటీల్లో ఎనిమిదో స్థానంలో నిలిచినా ఒక దేశం నుంచి ఇద్దరికే అవకాశం ఉండటంతో ఆమె అవకాశం కోల్పోయింది. అందుకు కారణం.. అంతకు ముందు శస్త్రచికిత్స చేయించుకున్న మోకాలి గాయం మళ్లీ తిరగబెట్టడం.
ఫైనల్ చేరనందుకు దీపా నిరుత్సాహానికి గురైంది. ముభావంగా ఉన్న ఆమెను చూసి కోచ్ బిష్వేశ్వర్ నంది ఎంత నచ్చజెప్పినా వినలేదు. ఏడుస్తూనే కూర్చుకుంది. అల్పాహారమూ మానేసింది. చివరికి తేరుకొని బృంద విభాగంలో తన సహచరులకు మద్దతుగా నిలిచింది. చప్పట్లు కొడుతూ వారిని ప్రోత్సహపరిచింది. దీప గొప్పదనం ఏమిటంటే గాయం ఇంకా పూర్తిగా మాననేలేదు. నొప్పి అలాగే ఉంది.
వ్యక్తిగత విభాగంలో బాలెన్సింగ్ బీమ్ ఫైనల్లో పోటీ పడింది. ఏ మాత్రం గతి తప్పినా ఆమె కాలుకు జరిగే ప్రమాదం ఎంత భయకరంగా ఉంటుందో అందరం ఊహంచగలం. అయినప్పటికీ ఆమె చలించలేదు. ధైర్యంగా పోటీ పడింది. డిఫికల్టీలో 5.000, ఎగ్జిక్యూషన్లో 7.500 మొత్తం 12.500 పాయింట్లు సాధించింది. ఆమె పోటీపడ్డప్పుడు మూడో స్థానంలో ఉన్నా ఆ పాయింట్లకు పతకం రాదని దీపకు ముందే తెలుసు. అందుకే చిరునవ్వులు చిందిస్తూ అలాగే ఉండిపోయింది. చివరికి ఐదో స్థానంలో నిలిచింది. అభిమానులను చక్కగా పలకరించింది.