
హైదరాబాద్: భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ టోక్యో(2020) ఒలింపిక్ బెర్తే లక్ష్యంగా బాకు, దోహా వేదికలుగా జరిగే జిమ్నాస్టిక్స్ వరల్డ్కప్ ఈవెంట్ల బరిలోకి దిగుతోంది. ఈ రెండు టోర్నీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరచి టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకోవాలని దీప పట్టుదలతో ఉంది. గురువారం నుంచి బాకులో మొదలయ్యే అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్లో దీపా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది. ఇక, దోహా ప్రపంచకప్ మార్చి 20న ఆరంభం కానుంది.
జకార్తా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్లో మోకాలి గాయంతో పోటీల నుంచి అర్ధంతరంగా తప్పుకున్న దీపా.. గాయం నుంచి కోలుకున్నాక గత నవంబరులో జర్మనీలో జరిగిన వరల్డ్కప్ పోటీల్లో కాంస్య పతకం సాధించి సత్తా చాటింది. ఈ సందర్భంగా పతక అవకాశాలపై దీపా మాట్లాడుతూ "రాబోయే పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబరచేందుకు కఠోరంగా శ్రమించా" అని అన్నారు.
"ఒలింపిక్స్కు ముందు ఇది 8వ క్వాలిఫయింగ్ ఈవెంట్. క్రీడాకారుల టాప్-3 స్కోర్లు ఆధారంగా ఒలింపిక్ బెర్త్ను నిర్ణయిస్తారు. దీంతో వీలైన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్న తలంపుతో ఉన్నాను. గతేడాది జర్మనీలో పతకం సాధించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరిగింది. ఒలింపిక్స్ నాటికి నా ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకోవాలనుకుంటున్నాను" అని దీపా చెప్పుకొచ్చింది.
వచ్చే మూడు ప్రపంచక్పల్లో కనీసం ఒక్క పసిడి పతకమైన సాధిస్తే కానీ 2020 ఒలింపిక్స్ బెర్త్ లభించే అవకాశాలు మెరుగుపడవని దీపా కోచ్ బిశ్వేశ్వర్ నంది అన్నాడు. ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే దీపా ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశాలున్నాయని చెప్పాడు. మరోవైపు అశిష్ కపూర్, యోగేశ్వర్ సింగ్, ఉజ్వల్ నాయుడు ప్రపంచకప్లో బరిలోకి దిగుతున్నారు.