
ఢిల్లీ: భారత అథ్లెట్లకు త్వరలో డిజిటల్ ఆఫ్పీల్డ్ నైపుణ్యాల తరగతులను ప్రవేశ పెట్టనున్నట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. టార్గెట్ ఒలింపిక్ పోడియమ్ పథకం (టీఓపీఎస్) కింద దీన్ని నిర్వహించనున్నామని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. అథ్లెట్లు ఎక్కడా ఉన్నా ఆ పనులు తప్పక చేయండి అని క్రీడా శాఖ మంత్రి ట్వీట్ చేశారు.
'అతి త్వరలో అథ్లెట్ల కోసం డిజిటల్ తరగతులు ప్రారంభిస్తాం. దయచేసి అథ్లెట్లు అందరూ ఎక్కడా ఉన్నా ఆ పనులు తప్పక చేయండి' అని కిరణ్ రిజుజు ట్వీట్ చేశారు. దీనిపై స్పోర్ట్స్ అథారటీ ఆఫ్ ఇండియా (సాయ్) అధికారి ఒకరు స్పందించారు. 'ఇది ప్రత్యేకంగా టీఓపీఎస్ అథ్లెట్ల కోసం ప్రవేశపెట్టిన ప్రయోజన కార్యక్రమం. దీనిలో ఒప్పందాలపై సంతకాలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చట్టపరమైన విషయాలు వంటి ఆఫ్ఫీల్డ్ నైపుణ్యాలు నేర్పిస్తారు' అని అన్నారు.
'అయితే ఈ విషయాలను అంతకుముందు తరగతి గదులల్లో బోధించేవారు. కానీ.. టీఓపీఎస్ అథ్లెట్లు ఎక్కువ మంది బయట శిక్షణ పొందుతున్న నేపథ్యంలో ఇప్పుడు డిజిటల్గా ప్రవేశపెడుతున్నారు. ఇది ప్రపంచంలో ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవడానికి వీలుంటుంది' అని సాయ్ అధికారి తెలిపారు. టోక్యో ఒలింపిక్స్కు సన్నద్ధమయ్యే ఎంతో మంది భారత అథ్లెట్లు విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది.
కరోనా దెబ్బకు జూలై 24 నుంచి జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ను వాయిదా వేస్తున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ) మంగళవారం ప్రకటించింది. వచ్చే ఏడాది వేసవి తర్వాత వీటిని నిర్వహించే అవకాశం ఉంది. కాగా 124 ఏళ్ల ఒలింపిక్ క్రీడల చరిత్రలో ఇలా జరగడం ఇది నాలుగో సారి. 1916లో బెర్లిన్, జర్మన్ ఎంపైర్లో ఒలింపిక్స్ జరగాల్సి ఉండగా మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా క్రీడలను తొలిసారి రద్దు చేశారు.
ఆ తర్వాత 1940లో జపాన్ సమ్మర్, వింటర్ ఒలింపిక్స్ నిర్వహించాలని నిర్ణయించింది. అయితే అప్పట్లో రెండో ప్రపంచ యుద్ధం కారణంగా రద్దు చేశారు వేశారు. 1944లో లండన్లో జరగాల్సిన క్రీడలను కూడా రెండో ప్రపంచ యుద్ధమే అడ్డుకుంది. తాజాగా, ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఒలింపిక్స్ వాయిదా పడింది.