భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్కు దాదాపు రూ.16 కోట్లు వరకు క్యాష్ ప్రైజ్ వచ్చిందంటూ వస్తున్న వార్తలపై వినేశ్ భర్త సోమ్వీర్ రాథీ స్పందించారు. వినేశ్కు ఎలాంటి నగదు బహుమతి దక్కలేదని, తప్పుడు సమాచారం ప్రచారం అవుతుందని పేర్కొన్నారు. పారిస్ ఒలింపిక్స్లో మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్కు చేరిన వినేశ్ అదనంగా 100 గ్రాములు ఎక్కువగా ఉండడంతో అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే.
అయితే పతకం చేజారినప్పటికీ భారత్కు చేరుకున్న వినేశ్ ఫొగట్కు అపూర్వ స్వాగతం లభించింది. హర్యానాలో స్వగ్రామం చేరుకున్న ఆమెకు అభిమానులకు ఘనంగా స్వాగతించారు. ఈ క్రమంలో స్థానికులు వినేశ్కు లడ్డూలు కానుకగా అందించారు. అయితే కొన్ని ఆర్గనైజేషన్లు, వ్యాపారవేత్తలు, సంస్థలు వినేశ్ ఫొగట్కు సుమారు రూ.16 కోట్లు పైగా క్యాప్ ప్రైజ్ ఇచ్చారని జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఈ వార్తలను ఆమె భర్త సోమ్వీర్ తీవ్రంగా ఖండించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని తెలిపారు. ఇలాంటి ప్రచారం వ్యక్తిగతంగా బాధించడమే కాకుండా, సమాజ విలువలకే నష్టమని పేర్కొన్నారు. కాగా, తనకు కనీసం సంయుక్తంగా రజత పతకమైనా ఇవ్వాలని వినేశ్ చేసిన అప్పీల్ను తిరస్కరించిన కోర్టు ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) సోమవారం కారణాలను వెల్లడించింది.
''నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. బరువు విషయంలో నిబంధనలు అందరికీ ఒకటే. గరిష్ఠ బరువుకు లోబడే ఉండాలి. ఎవరికీ మినహాయింపు ఉండదు. కనీసం గ్రాము బరువు ఎక్కువగా ఉన్నా అనుమతించడం కుదరదు. ఇందుకు పూర్తి బాధ్యత రెజ్లర్దే. వినేశ్ తనకు తానుగానే 50 కిలోల విభాగాన్ని ఎంచుకుంది. అధిక బరువు ఉన్నానని ఆమె స్పష్టంగా పేర్కొంది. ఆమె అనుభవమున్న రెజ్లర్. గతంలో ఇలాంటి నిబంధనల నడుమ పోటీపడింది.రూల్స్ అర్థం చేసుకోలేకపోయిందనే సమస్యే తలెత్తదు'' అని కాస్ వివరించింది.
తొలి బౌట్లో ఒలింపిక్ చాంపియన్ యు యి సుసాకిపై సంచలన విజయం సాధించిన వినేశ్ ఆ తర్వాత క్వార్టర్స్, సెమీస్లోనూ గెలుపొంది ఫైనల్కు చేరింది. ఒలింపిక్స్ ఫైనల్కు చేరిన తొలి భారత మహిళా రెజ్లర్గా రికార్డుల్లోకెక్కింది. అయితే సెమీస్ పూర్తయ్యాక వినేశ్ 50 కిలోలకు మించి ఉంది. రుతుస్రావానికి ముందు దశలో అధికంగా నీరు తాగడం వల్లే ఇలా జరిగిందని, తగిన సమయం లేనందు వల్లే బరువు తగ్గించలేకపోయానని మినహాయింపు ఇవ్వాలని కాస్ను వినేశ్ కోరింది. కానీ ఆమె అప్పీల్ను కాస్ తిరస్కరించింది. వినేశ్ నిర్ణీత 50 కేజీల కంటే 100 గ్రాముల అదనంగా ఉంది.