న్యూఢిల్లీ: ఎఫ్ సి గోవా క్లబ్ వంటి జట్లు పాయింట్ల పట్టికలో దిగువస్థానంలో ఉన్నా సమీస్లో బెర్త్ అవకాశాలపై ఆశలు కోల్పోలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న ఐఎస్ఎల్ 3 ఎడిషన్లో జికో శిక్షణలో ముందుకు సాగుతున్న ఎఫ్ సి గోవా సెమీ ఫైనల్స్ లో చేరేందుకు గల అవకాశాలకు శనివారం జరిగిన మ్యాచ్ గండి కొట్టింది. ఢిల్లీ డైనమోస్ చేతిలో 2 - 0 స్కోర్ తేడాతో ఓటమి పాలైన గోవా జట్టు ఇప్పటికీ సెమీస్ బెర్త్కు తలుపులు మూసుకుపోలేదని విశ్వసిస్తున్నది.
గత ఏడాది ఫైనల్స్ వరకు దూసుకొచ్చిన ఎఫ్ సి గోవా జట్టు ఇప్పుడు ఏడు మ్యాచ్ ల్లోనే కేవలం నాలుగు పాయింట్లు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో దిగువన స్థిరపడింది. అయినా టాప్ ఫోర్ లో చోటు దక్కించుకునేందుకు వ్యూహ రచనలు చేస్తూనే ఉన్నది. ప్రస్తుతం అన్నింటికంటే అత్యధికంగా 12 పాయింట్లు సాధించిన అట్లెటికో డీ కోల్ కతాతో గోవా కోచ్ జికో పోలుస్తున్నాడు. తద్వారా తమకు కేవలం ఎనిమిది పాయింట్లే తక్కువ అని.. వ్యాఖ్యానించాడు.
సెకండాఫ్ లో జరిగే ఏడు మ్యాచ్ల్లో ఐదింట గెలుపొందితే చాలు తాము నాకౌట్ దశకు చేరుకోగలమని విశ్వాసంతో చెబుతున్నాడు. నాకౌట్ దశకు చేరుకొనేందుకు 15 పాయింట్లు ఉంటే చాలునని అంటున్నాడు. 'నాకౌట్ దశకు క్వాలిఫై కావాలంటే 20 పాయింట్లు చాలా బాగుంటుంది. కానీ ఇతర జట్ల విజయావకాశాలను బట్టి అంతకంటే తక్కువగా పాయింట్లు సాధించినా ఫర్వాలేదు' అని జికో తెలిపాడు. తొలి ఏడు మ్యాచ్ ల్లోనూ చాలా మ్యాచ్ లు డ్రాగా ముగిసాయని గుర్తుచేస్తున్నాడు.
2014లో కేరళ బ్లాక్ బస్టర్స్, అట్లెటికో డీ కోల్ కతా జట్లు సెమీ ఫైనల్స్ కు చేరుకొనేందుకు చెరి 19 పాయింట్లు సాధించాయి. గత ఏడాది ఢిల్లీ డైనమోస్, చెన్నయిన్ ఎఫ్ సి జట్లు చెరీ 22 పాయింట్లతో నాకౌట్ దశకు పోటీ పడ్డాయి. గమ్మత్తేమిటంటే క్రితంసారి నార్త్ఈస్ట్ 20 పాయింట్లు సాధించినా సెమీ ఫైనల్స్ కు అర్హత సాధించలేదు. కానీ ఈ దఫా పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో ఏ జట్టు 18 పాయింట్లు సాధించినా సెమీస్ బెర్త్ ఖరారుచేసుకున్నట్లేనని అంచనా వేస్తున్నారు.

ఈ సీజన్ టోర్నీ దాదాపు సగం పూర్తిదశకు చేరుకున్నది. తొలి రెండు ఎడిషన్లతో పోలిస్తే.. ఈసారి ఫలితాలు సాధించిన మ్యాచ్లు తక్కువ. 27 మ్యాచ్ లు జరిగితే పదింటిని డ్రాగా ముగించాయి వివిధ జట్లు. కనుక ఈ దఫా టోర్నీ జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని భావిస్తున్నారు. దాని ఫలితంగా నాకౌట్ దశ కోసం టాప్ ప్లేస్లో నిలిచే జట్ల మధ్య చాలా, చాలా స్వల్ప తేడాలు ఉంటాయి.
టోర్నీ పూర్తిగా టైట్గా మారిపోతున్న నేపథ్యంలో జట్లేవీ నాకౌట్ దశలో చోటు దక్కించుకునే అవకాశాలను అంత తేలిగ్గా తీసిపారేయలేవు. ఆరు పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచిన ఎఫ్ సి పుణె సిటీ మొదలు కేవలం నాలుగు పాయింట్లతో పూర్తిగా దిగువన ఉన్న ఎఫ్ సి గోవా.. త్వరితగతిన రెండు మ్యాచ్ ల్లో విజయం సాధిస్తేనే టాప్ ఫోర్ బ్లాక్ లో చోటు దక్కించుకునే అవకాశాల్లేవు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జట్లన్నీ తమ సొంతగడ్డపై జరిగే మ్యాచ్ ల్లోకన్నా ఇతర ప్రాంతాల్లో జరిగే మ్యాచ్ ల్లోనే గెలుపొందుతుండటం గమనార్హం.
చారిటీకి మాంఛెస్టర్ యునైటెడ్ కోచ్ వాచ్
మాంఛెస్టర్: మాంఛెస్టర్ యునైటెడ్ క్లబ్ జట్టు మేనేజర్ జోన్ మౌరిన్హో తన చేతి గడియారాన్ని చారిటీ వేలానికి విరాళంగా అందజేశారు. ఫుట్ బాల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఛారిటీ డిన్నర్ కోసం దీన్ని విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించారు. ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో సోమవారం రాత్రి జరిగిన వేలంలో మౌరిన్హో వాచ్ వేలం వేశారు. తదుపరి వేలం నిర్వాహకులు దాన్ని స్వాధీనంచేసుకున్నారు. 2,63,094 డాలర్ల విరాళాల సేకరణలో భాగంగా ఈ వాచ్ వేలం వేశారు. బాస్టియన్ స్వెయిన్స్టైగర్ సహా మాంఛెస్టర్ యునైటెడ్ జట్టు తొలి విడత శిక్షణ కోసం మాంచెస్టర్కు చేరుకున్నది.