హైదరాబాద్: సాల్ట్ లేక్ వరల్డ్ కప్లో భారత ఆర్చర్లు సత్తా చాటారు. అమెరికాలో జరుగుతున్న మహిళల సింగిల్స్ రికర్వ్ విభాగంలో భారత్కు చెందిన దీపిక కుమారి స్వర్ణం సాధించింది. జర్మనీకి చెందిన మిచెల్లి క్రాప్పన్పై 7-3తో విజయం సాధించి దీపిక స్వర్ణం సొంతం చేసుకుంది.
ఆర్చరీ వరల్డ్ కప్లో దీపికకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. ఆరేళ్ల తర్వాత దీపిక కుమారి వ్యక్తిగత విభాగంలో స్వర్ణం నెగ్గింది. తాజా విజయంతో అక్టోబరు నెలలో టర్కీ వేదికగా జరిగే వరల్డ్ కప్ ఫైనల్ పోటీలకు అర్హత సాధించింది.
అనంతరం దీపిక మాట్లాడుతూ "ఎట్టకేలకు, అనుకున్నది సాధించా. స్వర్ణ పతకం సాధించా. నవంబరులో టర్కీలో జరిగే వరల్డ్ కప్ ఫైనల్కు అర్హత సాధించానా లేదా అన్న దాని గురించి ఆలోచించను. నా ఆటను నేను ఆస్వాదిస్తూ, ఎంజాయ్ చేస్తూ ఆడటం మాత్రమే నాకు తెలుసు. గెలుపోటముల గురించి పట్టించుకోను" అని తెలిపింది.
ఆర్చరీ వరల్డ్ కప్లో ఆరు సార్లు పాల్గొన్న దీపిక గతంలో 2011, 2012, 2013, 2015లో రజత పతకాలు సొంతం చేసుకుంది. మరోవైపు, ఇదే టోర్నీలో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో అభిషేక్ వర్మ-జ్యోతి సురేఖ జోడీ కాంస్యం దక్కించుకున్న సంగతి తెలిసిందే.