
హైదరాబాద్: ప్రముఖ రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ జీవితం ఆధారంగా ఆమీర్ఖాన్ హీరోగా నటించిన చిత్రం 'దంగల్' బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాలో తన కుమార్తెలైన గీత, బబితకు మహావీర్ శిక్షణ ఇస్తాడు. శిక్షణ ఇచ్చే సమయంలో సోదరుడి వరుస అయిన వ్యక్తితో కుమార్తె చేత కుస్తీ పట్టిస్తాడు.
ఈ పోటీల్లో తొలుత ఓటమి పాలైన మహావీర్ కుమార్తె ఆ తర్వాత అతడిపై విజయం సాధిస్తుంది. సరిగ్గా ఇలాంటి సన్నివేశమే మంగళవారం వారణాసి అఖడలో గోస్వామి తులసీదాస్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే రెజ్లింగ్ పోటీల్లో చోటు చేసుకుంది.
వారణాసిలోని సంకత్మోచన్ టెంపుల్ ప్రధాన పూజారి అమర్నాథ్ మిశ్రా (చనిపోయారు) గుర్తుగా ప్రతి ఏడాది వారణాసిలోని అస్సీ ఘాట్లో ప్రతి ఏటా రెజ్లింగ్ పోటీలను నిర్వహిస్తుంటారు. మంగళవారం ప్రారంభమమై ఈ రెజ్లింగ్ పోటీల్లో తొలిసారి ఈ ఏడాది మహిళా రెజ్లర్లకు అవకాశం కల్పించారు.
48, 75 కేజీల విభాగంలో మొత్తం 24 మంది మహిళలు పాల్గొన్నారు. తొలిరోజు పోటీల్లో భాగంగా 48 కేజీల విభాగంలో ఖుషి యాదవ్ అనే 16 ఏళ్ల యువతి, కరణ్కి మధ్య పోటీలో విజయం సాధించింది. అయితే ఈ పోటీలో పాల్గొన్న కరణ్ ఎవరో కాదు ఖుషి యాదవ్ తమ్ముడే.
తన కంటే రెండేళ్లు చిన్నవాడైన కరణ్తో జరిగిన పోటీలో ఖుషి యాదవ్ మంచి ప్రదర్శన చేసింది. దీంతో అందరి ప్రశంసలు అందుకుంది. అంతేకాదు దంగల్ సినిమాలోని సీన్ను రిపీట్ చేసింది. ఈ రెజ్లింగ్ పోటీలను తిలకించేందుకు పెద్దఎత్తున స్థానికులు తరలివచ్చారు.
ఖుషి, కరణ్లతో పాటు వారి తండ్రి వినోద్ యాదవ్ కూడా జాతీయ స్థాయి రెజ్లర్ కావడం విశేషం. రెజ్లింగ్ పోటీలో విజయానంతరం ఖుషి మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడంతో పాటు ఒలింపిక్స్ పతకం సాధించడమే తన లక్ష్యమని వెల్లడించింది.