న్యూఢిల్లీ: మంగళవారం జరిగిన ఐవోఏ సర్వసభ్య సమావేశంలో సురేష్ కల్మాడీ, అభయ్సింగ్ చౌతాలాను భారత ఒలింపిక్ సమాఖ్య (ఐవోఏ) జీవిత కాల గౌరవాధ్యక్షులుగా నియమించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి నియామకం ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ కామన్వెల్త్ (2010) క్రీడల కుంభకోణంలో నిందితులుగా ఉన్న వీరిద్దరికి ఐఓఏ పదవులు కట్టబెట్టడంపై కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్ సైతం తప్పుపట్టారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఐవోఏ తీసుకున్న నిర్ణయంపై వివరాలు సేకరించిన ఆయన బుధవారం చర్యలకు ఉపక్రమించారు.

ఇందులో భాగంగా భారత ఒలింపిక్ సమాఖ్య (ఐవోఏ)కు కేంద్ర క్రీడల శాఖ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. వారిద్దరని ఆ పదవుల నుంచి తప్పించే వరకు భారత ఒలింపిక్ సమాఖ్య (ఐవోఏ)తో ఎటువంటి సంబంధాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఐఓఏ గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది.
'ఇది ఐఓఏ రాజ్యాంగానికి విరుద్ధం. మేం దీన్ని అంగీకరించం. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులకు పదవులివ్వాలన్న నిర్ణయంపై తీవ్రంగా నిరాశ చెందాం. క్రీడల్లో మేం పారదర్శకత కోరుకుంటున్నాం. వీళ్లిద్దరినీ తప్పించడమో.. వాళ్లే రాజీనామా చేయడమో జరిగే దాకా మేం ఐఓఏతో సంబంధాలు సాగించబోం' అని క్రీడల మంత్రి విజయ్ గోయల్ స్పష్టం చేశాడు.
మరోవైపు ఐవోఏకు జీవితకాల అధ్యక్షుడిగా ఉండాలంటూ ఇచ్చిన ఆఫర్ను సురేశ్ కల్మాడీ తిరస్కరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఈ పదవి చేపట్టలేనంటూ ఐఓఏకు కల్మాడీ లేఖ రాశాడు. 'నన్ను జీవిత కాల అధ్యక్ష పదవితో గౌరవించాలనుకున్నందుకు ఐఓఏకు ధన్యవాదాలు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పదవిని నేను అంగీకరించడం సబబు కాదని భావిస్తున్నా. నా పేరు స్వచ్ఛంగా బయటికి వస్తుందని నమ్మకంతో ఉన్నా. అప్పటి వరకు ఈ గౌరవాన్ని నేను స్వీకరించలేను' అని కల్మాడీ ఈ లేఖలో పేర్కొన్నాడు.
మరోవైపు తనపై ఉన్న అవినీతి కేసుల నుంచి తాను సచ్ఛీలుడిగా బయటపడే వరకు ఎలాంటి అధికార పదవి చేపట్టకూడదని కల్మాడీ నిర్ణయించుకున్నట్లు ఆయన లాయర్ హితేష్ జైన్ వెల్లడించారు. అంతేకాదు కల్మాడీ నిర్ణయం వెనుక ఎవరి ఒత్తిడి లేదని ఆయన స్పష్టంచేశారు.
వివరాల్లోకి వెళితే మంగళవారం జరిగిన ఐవోఏ సర్వసభ్య సమావేశంలో సురేష్ కల్మాడీతో పాటు వివాదాస్పద నేపథ్యం ఉన్న అభయ్ సింగ్ చౌతాలాను జీవితకాల అధ్యక్షులుగా ఐవోఏ ఎన్నుకుంది. ఈ ఇద్దరినీ ఐవోఏ తమ జీవితకాల అధ్యక్షులుగా నియమించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
అయితే ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకున్నట్లు ఐవోఏ తెలిపింది. మరోవైపు సురేష్ కల్మాడీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మాజీ మంత్రి అజయ్ మాకెన్ అభినందించారు. కల్మాడీ, చౌతాలాలను లైఫ్ ప్రెసిడెంట్లుగా నియమించిన ఐవోఏ సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
1996-2011 వరకు కల్మాడీ ఐవోఏ అధ్యక్షుడిగా ఉన్నాడు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా భారీ స్కామ్లకు పాల్పడడంతో 10 నెలల జైలుశిక్ష అనుభవించి బెయిల్పై విడుదలయ్యాడు. కల్మాడీ తర్వాత 2012-14 మధ్య కాలంలో ఐఓఏ అధ్యక్షుడిగా ఉన్న చౌతాలా మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే కల్మాడీ లాగే ఐఓఏ జీవిత కాల అధ్యక్ష పదవికి నామినేట్ అయిన అభయ్ సింగ్ చౌతాలా మాత్రం తన విషయంలో జరుగుతున్నది అనవసర రాద్దాంతం అని పేర్కొన్నాడు. కేంద్ర మంత్రి విజయ్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డాడు. 'గోయల్ స్పందన చూసి నాకు ఆశ్చర్యమేసింది. నా మీద క్రిమినల్, అవినీతి కేసులున్నట్లు గోయల్ చెప్పాడు. కానీ నాపై క్రిమినల్ కేసులేమీ లేవు. ఉన్నదల్లా రాజకీయ కేసు మాత్రమే. క్రీడల మంత్రిగా తన బాధ్యతల్ని నిర్వర్తించడంలో గోయల్ విఫలమయ్యాడు. అతను తన పనిని సక్రమంగా నిర్వర్తిస్తే ఒలింపిక్స్ లాంటి టోర్నీల్లో మన పతకాల సంఖ్య పెరిగేది. నిజాలు తెలుసుకోకుండా మాట్లాడి వివాదాల్లో చిక్కుకోవడం మాని, గోయల్ తన పనిపై దృష్టిసారిస్తే మేలు' అని చౌతాలా అన్నాడు.