
హైదరాబాద్: రెండు సార్లు కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత అయిన సంజితా చానుపై విధించిన సస్పెన్షన్ను అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ తాత్కాలికంగా తొలగించింది. యాంటీ డోపింగ్ నియమాలను ఉల్లంఘించిన కారణంగా చానుపై అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ (ఐడబ్ల్యూఎఫ్) గతేడాది నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే.
డోప్ టెస్టింగ్ పాజిటీవ్గా తేలడంతో 25 ఏళ్ల సంజితా చానూపై ఐడబ్ల్యూఎఫ్ 15మే, 2018న నిషేధం విధించింది. సంజితా చాను నిషేధం ఎత్తివేతపై భారత వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ సహదేవ్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
"చాుపై విధించిన నిషేదం తాత్కాలికంగా తొలగింది. నిషేదాన్ని ఐడబ్ల్యూఎఫ్ పూర్తిగా ఎత్తేయలేదు. విచారణ కొనసాగుతుంది. తాజా నిర్ణయం ఆమెకు కలిసిరానుంది. చాను ఇప్పుడు శిక్షణ కోసం క్యాంప్ రావొచ్చు. తుది తీర్పు ఆమెకు అనుకూలంగా వస్తదని నమ్ముతున్నాం. చానుపై మాకు పూర్తి విశ్వాసం ఉంది" అని అన్నారు.
దేశం ఆమెను వదులుకోవడానికి సిద్ధంగా లేదని ఆయన చెప్పాడు. నిషేధం ఎత్తివేసేందుకు తమ వంతుగా ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా 2018లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో 53కేజీల విభాగంలో సంజితా చాను స్వర్ణ పతకం సాధించింది.
నవంబర్ 2017లో యునైటెడ్ స్టేట్స్ వేదికగా వరల్డ్ ఛాంపియన్షిప్ జరగడానికి ముందు ఆమె యూరిన్ శాంపిల్ను తీసుకుని పరీక్షించడంతో ఆమె డోపింగ్ నియమాలను ఉల్లంఘించినట్లు తేలింది. దీంతో అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ మే 15, 2018న నిషేధం విధించింది.