
హైదరాబాద్: క్రీడాకారులకు సంబంధించిన కుటుంబ సభ్యులను ఆహ్వానించేది లేదని కామన్వెల్త్ క్రీడలనుద్దేశించి రాజ్యవర్థన్ సింగ్ పేర్కొన్నారు. ఇవేం సరదా కోసం వెళ్లే ఆటలు కాదని.. అథ్లెట్లతో వారి కుటుంబ సభ్యులను అనుమతించబోమని భారత క్రీడల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్ 4న ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లో ఆరంభమయ్యే ఈ మెగా ఈవెంట్ కోసం భారత ఒలింపిక్ సంఘం 222 మంది అథ్లెట్ల పేర్లను ప్రకటించింది. వీరు కాకుండా 106 మంది అధికారులున్నారు. వీరిలో 57 మంది కోచ్లు, 19 మంది మేనేజర్లు, 41 మంది ఇతర సహాయక సిబ్బంది ఉన్నారు.
మరో 41 మంది అధికారులకు క్రీడల మంత్రి నుంచి అనుమతి రావాల్సి ఉంది. 2014 కామన్వెల్త్ క్రీడల కన్నా ప్రస్తుత పోటీల్లో పాల్గొనే అథ్లెట్లు ఏడుగురు ఎక్కువ. ఆటగాళ్లతో వెళ్లే అధికారుల తుది బృందంపై క్రీడల శాఖ రెండురోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. కామన్వెల్త్ సరదా కోసం వెళ్లే యాత్ర కాదని.. ఆటగాళ్లు, అధికారుల కుటుంబ సభ్యులకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వబోమని ఆ శాఖ చెప్పింది.
'ఎంత పెద్ద స్టార్ అథ్లెట్ అయినా కుటుంబ సభ్యులను అనుమతించేది లేదు. ప్రభుత్వ సొమ్ము వారి కోసం ఎందుకు ఖర్చు పెట్టాలి. 41 మంది అధికారుల జాబితా ఇంకా నిలిపి ఉంచాం. అధికారులు ఆస్ట్రేలియా వెళ్లడానికి ఇదో అవకాశంగా భావిస్తున్నట్లు తెలిసింది. క్రీడాకారులకు చాలినంత అధికారులను మాత్రమే పంపాలని భావిస్తున్నాం' అని క్రీడల మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.
రియో ఒలింపిక్స్ సమయంలోనూ భారత బృందం పంపే విషయంలో ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. భారీ బృందంతో వెళ్లిన భారత జట్టు రెండే పతకాలతో వెనుదిరగడంపై తీవ్ర విమర్శలు రేగాయి.