|
హాకీలో రజతం..
ఇప్పుడిక తాజాగా హాకీలో భారత మహిళల జట్లు రజత పతకాన్ని అందుకుంది. సెమీ ఫైనల్స్లో న్యూజిలాండ్ జట్టును 2-1 గోల్స్ తేడాతో మట్టి కరిపించింది. పెనాల్టీ షూటౌట్లో న్యూజిలాండ్ను ఓడించింది. 1-1 గోల్స్ తేడాతో సమవుజ్జీగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్ అవసరమైంది. న్యూజిలాండ్ స్ట్రైకర్ల పెనాల్టీ షూటౌట్లను నిలువరించడంలో కేప్టెన్ కమ్ గోల్ కీపర్ సవిత పునియా మరోసారి తనకు తిరుగులేదనిపించుకున్నారు.
తొండాటతో..
నిజానికి- తొలి సెమీ ఫైనల్స్లో ఆస్ట్రేలియా ఆడిన తొండాటకు మహిళల హాకీ జట్టు బలి అయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ను 3-0 తేడాతో ఓడిపోయింది. ఆస్ట్రేలియా పెనాల్టీ షూటౌట్ను గోల్ కీపర్ సవిత పునియా సమర్థవతంగా అడ్డుకున్నప్పటికీ.. అది రద్దయింది. టైమర్ స్తంభించిపోయిందనే కారణంతో రీటేక్ చేయాల్సి వచ్చింది. ఆ రీటేక్ను ఆస్ట్రేలియా గోల్గా మలచుకోగలిగింది. అదే సమయంలో తనకు దక్కిన అవకాశాలను పోగొట్టుకుంది.
|
హోరాహోరీ పోరులో..
ఆ పొరపాట్లకు రెండో సెమీ ఫైనల్స్లో ఎలాంటి అవకాశం ఇవ్వలేదు టీమిండియా విమెన్స్ హామీ ప్లేయర్లు. న్యూజిలాండ్ గోల్ కీపర్ కళ్లుగప్పి బంతిని గోల్ పోస్ట్లోకి మెరుపు వేగంతో పంపించగలిగారు. దీనితో 2-1 గోల్స్ తేడాతో టీమిండియా విజయం సాధించింది. మూడో స్థానంలో నిలిచి, రజత పతకాన్ని అందుకుంది. అంతకుముందు నార్మల్ టైమ్లో భారత్-న్యూజిలాండ్ జట్లు హోరాహోరీగా పోరాడాయి. ఒకరి గోల్ అవకాశాలను మరొకరు సమర్థవంతంగా అడ్డుకోగలిగారు. చెరో గోల్ సాధించి- సమవుజ్జీగా నిలిచారు.
షూటౌట్లో న్యూజిలాండ్ అవుట్..
దీనితో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్కు దారి తీసింది. పెనాల్టీ షూటౌట్లో న్యూజిలాండ్ స్ట్రైకర్ల దాడిని సవిత పునియా విజయవంతంగా అడ్డుకున్నారు. బంతిని గోల్ పోస్ట్లోకి పంపించడానికి చేసిన ప్రయత్నాలను వమ్ము చేశారు. ఆస్ట్రేలియాతో ఎదురైన చేదు అనుభవం నుంచి శరవేగంగా కోలుకుంది జట్టు. నార్మల్ టైమ్, పెనాల్టీ షూటౌట్లో సొనికా నవ్నీత్ కౌర్ గోల్స్ సాధించారు. నార్మల్ టైమ్లో న్యూజిలాండ్ డిఫెండర్ మెగాన్ హల్ గోల్ కొట్టారు. పెనాల్టీ షూటౌట్లో న్యూజిలాండ్.. గోల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.