Mijain Lopez Nunez: క్యూబాకు చెందిన రెజ్లర్ మిజాయిన్ లోపెజ్ న్యునెజ్ చరిత్ర సృష్టించాడు. ఒకే ఈవెంట్లో అయిదు ఒలింపిక్ బంగారు పతకాలను సాధించిన ఒకే ఒక్కడుగా రికార్డు నెలకొల్పాడు. ఇలాంటి రికార్డొకటి ఇప్పటివరకు ఏ స్పోర్స్ ఈవెంట్లో కూడా లేదు. ఏ అథ్లెట్ అయినా కలలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు.
పురుషుల 130 కేజీల గ్రీకో-రోమన్ రెజ్లింగ్ కేటగిరీలో క్యూబాకు చెందిన మిజైన్ లోపెజ్ నునెజ్ బంగారు పతకాన్ని ముద్దాడాడు. ఫైనల్లో 6-0 స్కోరుతో చిలీకి చెందిన యస్మాని అకోస్టా ఫెర్నాండెజ్ను మట్టికరిపించాడు. ఓ లెజెండ్గా తన పేరును లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్ తరువాత రిటైర్మెంట్ను ప్రకటించాడు. దీనికి గుర్తుగా తన రెజ్లింగ్ షూస్లను రింగ్లోనే వదిలేశాడు.

ఈ విజయంతో రెజ్లింగ్కు వీడ్కోలు చెప్పబోతోన్నానని లోపెజ్ ప్రకటించాడు. రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించడం బాధాకరమే అయినప్పటికీ.. కొత్తవారికి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించాడు. రెజ్లింగ్ అనేది తన జీవితంలో ఒక భాగమని, రిటైర్ అయినంత మాత్రాన దీన్నుంచి తాను విడిపోయినట్లుగా భావించకూడదని పేర్కొన్నాడు.
ఈ గేమ్ తనను అ ప్రపంచానికి పరిచయం చేసిందని, అలాగే- ఎందరో కొత్త అథ్లెట్లు రెజ్లింగ్ను తమ కేరీర్గా ఎంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు. 21 సంవత్సరాల వయస్సులో ఒలింపిక్స్లో తొలిసారిగా ఎంట్రీ ఇచ్చాడు. ఏథెన్స్ 2004 ఒలింపిక్ అరంగేట్రం చేశాడు. క్వార్టర్ ఫైనల్స్లో నిష్క్రమించాడు.
2008లో బీజింగ్లో జరిగిన ఒలింపిక్స్లో తొలి బంగారు పతకాన్ని అందుకున్నాడు. అక్కడ ఆరంభమైన అతని జైత్రయాత్ర పారిస్ వరకూ కొనసాగింది. 2012 లండన్, 2016 రియో డి జనేరియో, 2020 టోక్యో ఒలింపిక్స్ పురుషుల రెజ్లింగ్ విభాగంలో బంగారు పతకాలను అందుకున్నాడు.
ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్లోనూ తన దూకుడును కొనసాగించాడు. లోపెజ్ వయస్సు 41 సంవత్సరాలు. వయసు మీద పడుతున్నా అతని ఉడుం పట్టు మాత్రం సడల్లేదు. ఫైనల్స్లో ఇరాన్కు చెందిన మల్లయోధుడు అమీన్ మీర్జాజదేను ఓడించాడు.