
హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్ 2021.. ప్రపంచమంతా ఈ అంతర్జాతీయ పోటీల కోసం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తోంది. ఇంకో 13 రోజుల్లో ప్రారంభం కానున్న ఈ విశ్వ పోటీలకు ఏర్పాట్లు సర్వం సిద్ధం అవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనబోయే భారత క్రీడాకారులను ఉద్దేశించి ఇటీవలే ప్రసంగించారు. అథ్లెట్లను దేశ ప్రజలంతా ఉత్సాహపరచాలంటూ ప్రధాని పిలుపునిచ్చారు. అందుకు మద్దతుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిలిచింది. భారత క్రికెటర్లందరూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న వీడియోను ట్వీట్ చేసింది.
బీసీసీఐ పోస్ట్ చేసిన వీడియోలో మహిళల, పురుషుల జట్ల కెప్టెన్స్ మిథాలీ రాజ్, విరాట్ కోహ్లీ 'ఛీర్4ఇండియా' అంటూ అథ్లెట్లలో జోష్ నింపారు. రోహిత్ శర్మ, హర్మన్ప్రీత్ కౌర్, అజింక్య రహానే తదితరులు 'చీర్ఫర్ ఇండియా' అంటూ కనిపించారు. ఈ మెగా క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులంతా గెలవాలని ఆకాంక్షించారు. ఆ వీడియోలో ప్రధాని ఒలింపిక్స్ కోసం వెళ్లనున్న ఆటగాళ్లను ప్రత్యేకంగా అభినందించారు. వీడియోలో బ్యాక్ డ్రాప్ సాంగ్ అందరిని ఆకర్షిస్తోంది.
ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో జులై 17న టోక్యో వెళ్లనున్నారు భారత బృందం. ఈ నేపథ్యంలో అథ్లెట్లను ఉద్దేశిస్తూ జూన్ 9 మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. వారిని ఉత్సాహపరచాలని దేశ ప్రజలను కోరారు. ఇందులో భాగంగానే బీసీసీఐ తాజాగా భారత క్రికెటర్లతో కలిసి వీడియోను రూపొందించింది. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఒలింపిక్స్ గేమ్స్ జరగనున్నాయి. ఇప్పటికే 120 మందికి పైగా భారత అథ్లెట్లు ఒలింపిక్స్కు అర్హత సాధించారు.
గతేడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. వైరస్ ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టడంతో జులై 23 నుంచి జపాన్ రాజధాని టోక్యోలో పటిష్ట భద్రత మధ్య జరగనున్నాయి. ఇక ఒలింపిక్ జ్యోతి క్రీడల వేదికైన టోక్యో చేరింది. శుక్రవారం జపాన్ రాజధానిలో జ్యోతి ఆవిష్కరణను నిరాడంబరంగా నిర్వహించారు. టోక్యోలో అత్యయిక స్థితి అమలు చేస్తుండటంతో వచ్చే రెండు వారాల్లో జ్యోతి యాత్రను ప్రధాన వీధుల గుండా కాకుండా మారుమూల ద్వీపాల్లో కొనసాగించాలని నిర్ణయించారు.