
ఢిల్లీ: కొవిడ్ 19 ప్రభావంతో మంగళవారం నుంచి ఢిల్లీలో ప్రారంభం కానున్న ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో చైనా రెజ్లర్లు పాల్గొనడానికి భారత ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఈరోజు నుంచి జరిగే రెజ్లింగ్ చాంపియన్షిప్లో చైనా రెజ్లర్లు పాల్గొనడం లేదు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ మాట్లాడుతూ... 'ప్రాణాంతక వైరస్ కారాగానే 40 మంది సభ్యుల చైనా రెజ్లింగ్ బృందానికి వీసాలు నిరాకరించినట్లు తెలిసింది. దీనివల్ల ఛాంపియన్షిప్లో వారు పాల్గొనడం లేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని మేం అర్థం చేసుకోగలం. ఎక్కడైనా ఆరోగ్యమే ముఖ్యం' అని అన్నారు.
'అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. సాధారణ సమయంలో తీసుకుంటుందేమో కానీ.. ఇప్పుడైతే ప్రపంచాన్నే వణికించే వైరస్ విలయతాండవం చేస్తుంది. ఇతర దేశాల్లో నిర్వహించిన క్రీడా పోటీలకు కూడా ఆ దేశాలు చైనా అథ్లెట్లకు అనుమతి ఇవ్వలేదు' అని తోమర్ పేర్కొన్నారు. ఇక భారత క్రీడల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ... 'మేం ఎవరిపైనా వివక్ష చూపట్లేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్ని పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకోం' అని అన్నారు.
చైనాలోని వుహాన్ పట్టణంలో వెలుగులోకి వచ్చిన కొవిడ్-19 రోజురోజుకూ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ ధాటికి చైనాలో మృతుల సంఖ్య ఇప్పటికే 1770కు చేరింది. ఇక వేలమంది కోవిడ్ బారిన పడ్డారు. ఈ వైరస్ చైనాలోని ఉత్పాదక, పర్యాటక, సాంకేతిక రంగాలనే కాదు క్రీడారంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఇప్పటికే కొవిడ్-19 దృష్ట్యా చైనాలో జరగాల్సిన మహిళా ఒలింపిక్ ఫుట్బాల్ అర్హత పోటీలు, ప్రపంచ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్, ఎఫ్1 గ్రాండ్ప్రిక్స్ వంటి ఈవెంట్స్ లాంటివి కొన్ని రద్దు కాగా.. మరికొన్నేమో వేరేచోటికి తరలివెళ్లాయి.