అసున్సియాన్ (పరాగ్వే): మహమ్మారి కరోనా (కొవిడ్ 19) వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 7,000 మంది మృతి చెందగా.. లక్షా 75వేల మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో క్రీడాలోకం మొత్తం అతలాకుతలం అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని టోర్నీలు వాయిదా లేదా రద్దవుతున్నాయి. ఈ క్రమంలో యూరో-2020, కోపా కప్లు ఏడాదిపాటు వాయిదా పడ్డాయి.
ఓ తేలికైన పని చేస్తే వైరస్ విస్తరించకుండా అడ్డుకోవచ్చు: సచిన్
కరోనా కారణంగా బ్రెజిల్, కొలంబియాలలో జూన్ నుంచి జరగాల్సిన కోపా అమెరికా కప్ వాయిదా పడింది. ఈ టోర్నీని 2021.. అంటే ఏడాదిపాటు వాయిదా వేస్తున్నట్టు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది జూన్ 11 నుంచి జూలై 11 వరకు టోర్నీ జరగనుంది. కోపా కప్ను తొలిసారి రెండు దేశాల్లో నిర్వహించాలనుకున్నారు.
కరోనా విజృంభణతో యూరోపియన్ ఫుట్బాల్ చాంపియన్షిప్ కూడా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం.. ఈ ఏడాది జూన్, జూలై నెలలలో యూరో-2020ని నిర్వహించాలని యూఈఎఫ్ఏ భావించింది. అయితే వైరస్ దెబ్బకు 2021కు చాంపియన్షిప్ను వాయిదా వేసినట్టు ప్రకటించింది.
కరోనా వైరస్ కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీని వాయిదా వేశారు. సెప్టెంబరు 20 నుంచి అక్టోబర్ 4 వరకు టోర్నీని రీషెడ్యూల్ చేస్తున్నట్టు నిర్వాహకులు ట్వీట్ చేశారు. వాస్తవంగా మే 24 నుంచి జూన్ 7 వరకు ఫ్రెంచ్ ఓపెన్ జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం టోర్నీని జరపలేమని నిర్వాహకులు చేతులెత్తేశారు. రీషెడ్యూల్ ప్రకారం యూఎస్ ఓపెన్ ముగిసిన వారం రోజుల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ జరగనుంది.
కోవిడ్-19 దెబ్బకు మరో క్రికెట్ లీగ్ వాయిదా పడింది. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను వాయిదా వేస్తున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేలాదిమంది ప్రాణాలను బలితీసుకుంటున్న నేపథ్యంలో లీగ్ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం పీఎస్ఎల్ నాకౌట్ దశకు చేరుకుంది. లాహోర్లో రెండు సెమీఫైనల్స్ జరగాల్సి ఉంది. 'హెచ్బీఎల్ పీఎస్ఎల్ 2020ని వాయిదా వేశాం. మళ్లీ ఎప్పుడు నిర్వహించేదీ చెబుతాం' అని పీసీబీ ట్వీట్ చేసింది.