కామన్వెల్త్ గేమ్స్లో భారతదేశానికి ఆరో రోజు కూడా పతకాలొచ్చాయి. అయితే ఈ రోజు భారత్కు చేదు తీపి కలయికగా మిగిలింది. ప్రముఖ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ ఓటమిపాలయింది.
జూడోలో 78 కేజీల ఫైనల్ మ్యాచ్లో ఓడి జుడోకా తులికా మాన్ రజత పతకాన్ని గెలుచుకుంది.
పురుషుల సింగిల్స్ స్క్వాష్లో సౌరవ్ ఘోషల్ ఇంగ్లాండ్కు చెందిన జేమ్స్ విల్స్ట్రాప్ను ఓడించి కాంస్యాన్ని సాధించాడు. CWGలో భారత్కు స్క్వాష్ క్రీడలో తొలి సింగిల్స్ పతకాన్ని అందించాడు.
అథ్లెటిక్స్లో హైజంపర్ తేజస్విన్ శంకర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కామన్ వెల్త్ గేమ్స్లో భారతీయులకు ఇదే తొలి హైజంప్ పతకం. పురుషుల 109కేజీల విభాగం వెయిట్లిఫ్టింగ్లో లవ్ప్రీత్ సింగ్, 109కిలోల విభాగంలో గుర్దీప్ సింగ్ ఒక్కో కాంస్య పతకాన్ని సాధించారు.
బాక్సర్లు నిఖత్ జరీన్ (50 కేజీలు), నీతు గంగాస్ (మహిళల 48 కేజీలు), హుస్సామ్ ఉద్దీన్ మహ్మద్ (పురుషుల 57 కేజీలు) సెమీ ఫైనల్లోకి ప్రవేశించి భారత్కు మరో మూడు పతకాలు సాధించేలా చేశారు.
ఒలింపిక్ పతక విజేత బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ తన లైట్ మిడిల్ వెయిట్ క్వార్టర్-ఫైనల్లో ఓడిపోవడం గమనార్హం. పురుషుల లైట్ హెవీవెయిట్ క్వార్టర్-ఫైనల్లో ఆశిష్ కుమార్ కూడా ఓటమి పాలయ్యాడు.
ఇక క్రికెట్ విషయానికొస్తే భారత మహిళల క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. బార్బడోస్ను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
హాకీలో.. భారత మహిళల జట్టు తమ చివరి పూల్ A మ్యాచ్లో కెనడాపై 3-2 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ చేరుకుంది. పురుషుల పూల్ బి మ్యాచ్లో కెనడాపై భారత మెన్స్ హాకీ టీం 8-0తో గెలుపొందింది.
లాన్ బౌల్స్ రౌండ్ 2లో భారత మహిళల డబుల్స్ లవ్లీ చౌబే మరియు నయన్మోని సైకియా తమ మ్యాచ్ను 23-6తో గెలుపొందగా, మృదుల్ బోర్గోహైన్ తన పురుషుల సింగిల్స్ మ్యాచ్లో 21-5తో గెలుపొందాడు.
మహిళల వెయిట్ లిఫ్టింగ్ 87+ కేజీల విభాగంలో పూర్ణిమ పాండే ఏకంగా 228కేజీల బెస్ట్ లిఫ్ట్తో ఆరో స్థానంలో నిలిచింది.