హైదరాబాద్: ఇటీవల ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో 69 కేజీల విభాగంలో స్వర్ణం సాధించిన వెయిట్ లిఫ్టర్ పూనమ్ యాదవ్ను భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) జాతీయ క్యాంప్ నుంచి సస్పెండ్ చేసింది.
ఈ ఏడాది జరుగనున్న ఆసియా గేమ్స్ కోసం పాటియాలాలోని నేతాజీ సుబాష్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన జాతీయ క్యాంప్లో శిక్షణ పొందుతున్న పూనమ్ అక్కడి అధికారుల అనుమతి లేకుండా రెండు సార్లు క్యాంప్ నుంచి పలుమార్లు బయటకు వెళ్లింది.
దీంతో ఆమెకు ఏప్రిల్ 18న అక్కడి అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత 15 రోజుల వ్యవధిలో అనుమతి లేకుండా రెండు సార్లు క్యాంప్ నుంచి బయటకు వెళ్లింది. దీంతో ఐడబ్ల్యూఎఫ్ ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.
'ప్రస్తుతం జరుగుతోన్న జాతీయ క్యాంప్లో పూనమ్ ఐడబ్ల్యూఎఫ్ నిబంధనలను ఉల్లంఘించింది. ఆమె పలుమార్లు నిబంధనలను అతిక్రమించింది. ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించబోం' అని ఐడబ్ల్యూఎఫ్ ఆమెకు ఓ లేఖ ద్వారా తెలిపింది.
ఈ విషయంపై ఐడబ్ల్యూఎఫ్ కార్యదర్శి సహదేవ్ యాదవ్ మాట్లాడుతూ 'గత మూడు-నాలుగు సంవత్సరాలుగా పూనమ్ చాలా కఠినమైన శిక్షణ తీసుకుంటోంది. రాబోయే ఆసియా క్రీడల్లో పూనమ్ స్థానం భర్తీ చేయలేనిది.కానీ ఈ విధంగా క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతూ క్యాంప్నకు గైర్హాజరు అయితే తిరిగి పుంజుకోవడం కష్టం' అని తెలిపారు.
వారణాసికి చెందిన పూనమ్ యాదవ్ తిరిగి క్యాంప్లో చేరాలంటే 'నాడా' ఆధ్వర్యంలో డోపింగ్ టెస్ట్ పాసవ్వాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.