
హైదరాబాద్: కామన్వెల్త్ క్రీడా సంబరాలకు తెరలేసింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్లో ఉన్న కరారే స్పోర్ట్స్ అండ్ లీసెర్ సెంటర్లో 21వ కామన్వెల్త్ క్రీడలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భారత్ స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు భారత జెండాను చేత పట్టుకుని ప్రారంభ కార్యక్రమంలో భారత బృందానికి నాయకత్వం వహించింది.
పీవీ సింధు జాతీయ పతకాన్ని పట్టుకుని ముందుకు నడుస్తుండగా మిగతా క్రీడాకారులు అందరూ ఆమె వెంట నడిచారు. గతంలో జరిగిన ఆరంభ వేడుకలకు భిన్నంగా ఈసారి భారత మహిళా క్రీడాకారిణిలు అందరూ చీరల్లో కాకుండా కోటు, ట్రౌజర్లో దర్శనమిచ్చారు. ఈసారి భారత్ మొత్తం 227 మందితో ఈ గేమ్స్లో పాల్గొంటోంది.
కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ వెలుగులు.. ప్రత్యేక అలంకరణలతో వేడుకల ప్రాంగణం మెరిపోయింది. డ్యాన్సులు, పాప్ సింగర్లు ఆలపించిన గీతాలతో మైదానం హోరెత్తింది. దాదాపు 25వేల మంది అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. గేమ్స్ అధికార ప్రతినిధులు, నిర్వాహకులతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్బుల్ కూడా ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. వివిధ దేశాలకు చెందిన అథ్లెట్లు తమదైన శైలిలో వేషధారణ ధరించి, విభిన్న హెయిర్ స్టైల్స్తో ఆకట్టుకున్నారు.
కామన్వెల్త్ గేమ్స్లో భాగంగా మొత్తం 18 క్రీడాంశాల్లో 71 దేశాల తరఫున 6,600కు పైగా క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారు. బ్యాడ్మింటన్, రెజ్లింగ్, షూటింగ్ విభాగాల్లో ఈ సారి భారత్ తరుపున క్రీడాకారులు ఎక్కువ పతకాలు గెలిచే అవకాశం ఉంది. బుధవారం ఆరంభ వేడుకలు జరగనుండగా, గురువారం నుంచి గేమ్స్ ప్రారంభమవుతాయి.
గోల్డ్ కోస్ట్ గేమ్స్లో మొత్తం 71 దేశాలు బరిలోకి దిగుతున్నాయి. 19 క్రీడాంశాల్లో పోటీలు.. 1500 పతకాల వేటలో వేలాది మంది అథ్లెట్లు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఓవరాల్గా భారత్ 17 క్రీడాంశాల్లో పోటీ పడుతోంది. మొత్తం 12 రోజుల పాటు క్రీడాభిమానుల్ని ఓలలాడించేందుకు 21వ కామన్వెల్త్ గేమ్స్కు రంగం సిద్దమైంది.
గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్లకు సులువైన డ్రా ఎదురైంది. దీంతో భారత దిగ్గజం మేరీ కోమ్ కామన్వెల్త్ తొలి పతకం అందుకునేందుకు ఒక్క విజయం సాధిస్తే చాలు. ఎందుకంటే మహిళల 48కేజీ విభాగంలో ఆమె నేరుగా క్వార్టర్స్లో ఆడబోతోంది. గెలిస్తే సెమీస్కు చేరుతుండగా కనీసం కాంస్యం సొంతమవుతుంది.
మరోవైపు పురుషుల విభాగంలో వికాస్ క్రిషన్ (75కేజీ)కు బై లభించడంతో నేరుగా ప్రీ క్వార్టర్ఫైనల్స్లో ఆడనున్నాడు. అలాగే ఈ గేమ్స్లో పతకాలు సాధించే జాబితాలో పీవీ సింధు, జీతూరాయ్, సైనా నెహ్వాల్, సుశీల్ కుమార్, వినేష్ ఫొగట్లు ఉన్నారు. పోటీలకు ముందే వినేష్ ఫొగట్ గాయపడం భారత్ను కలవరపెడుతోంది.
ఈ పోటీల్లో రెజ్లింగ్లో 50 కేజీల విభాగంలో వినేష్ ఫొగట్ పాల్గొంటుంది. బుధవారం ఉదయం ప్రాక్టీస్ సెషన్లో మెడ కింద తీవ్రమైన నొప్పితో అల్లాడింది. వెంటనే ఫిజియో ధీరేంద్ర ప్రతాప్సింగ్ శాయ్ అధికారుల సాయంతో చికిత్స నిమిత్తం ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఎక్స్రే, అల్ట్రా సౌండ్ స్కాన్ నిర్వహించిన వైద్యులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారు.