For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అభినవ్ బింద్రా, గగన్ నారంగ్ లకు స్వర్ణపతకం

By Pratap
Abhinav Bindra
న్యూఢిల్లీ: కామన్ వెల్త్ క్రీడల్లో భారత్ తొలి స్వర్ణపతకాన్ని సాధించింది. అభినవ్ బింద్రా, గగన్ నారంగ్ లు స్వర్ణపతకం సాధించారు. పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో వారు భారత పతాకను ఎగురవేశారు. మంగళవారం వారు ఫీట్ సాధించారు. సోమవారం వెయిట్‌లిఫ్టింగ్‌లో నాలుగు పతకాలతో మెరిసింది. మహిళల 48 కేజీ విభాగంలో సోనియా చాను, సంధ్యారాణి..పురుషుల 56 కేజీ విభాగంలో సుఖెన్‌ డే, వల్లూరి శ్రీనివాసరావు (ఆంధ్రప్రదేశ్‌) రజత, కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. మిగతా విభాగాల్లో తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్విమ్మింగ్‌లో పురుషుల 4X100మీ రిలే జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లి సంచలనం సృష్టించగా, వ్యక్తిగత విభాగాల్లో శుభ, బద్రీనాథ్‌ మినహా అందరూ విఫలమయ్యారు. బ్యాడ్మింటన్‌, టీటీ టీమ్‌ విభాగాల్లో భారత్‌ తిరుగులేని ప్రదర్శన చేసింది. టెన్నిస్‌లో బోపన్న సింగిల్స్‌లో ముందంజ వేశాడు. ఐతే నిరుపమ వైద్యనాథన్‌తో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌ అతడు తొలి రౌండ్లోనే వైదొలిగాడు. సానియా, పేస్‌ జోడీ రెండో రౌండుకు దూసుకెళ్లింది. ఆర్చరీ క్వాలిఫయింగ్‌లో భారత ఆర్చర్లు అదరగొట్టారు.

వెయిట్‌లిఫ్టింగ్‌ మహిళల విభాగంలో అగస్టీనా నికెమ్‌ (నైజీరియా) ఫేవరెట్‌ సోనియా చానుకు షాకిచ్చింది. స్నాచ్‌లో 77 కేజీలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 98 కేజీలు మొత్తం 175 కేజీలతో అగస్టీనా కామన్వెల్త్‌ క్రీడల రికార్డు నెలకొల్పింది. సోనియా 167 (స్నాచ్‌ -73, క్లీన్‌ అండ్‌ జర్క్‌ 94) కేజీలతో రజతంతో సరిపెట్టుకుంది. స్నాచ్‌లో తొలి ప్రయత్నంలోనే 73 కేజీలు ఎత్తిన ఆమె 76 కేజీల కోసం రెండుసార్లు విఫల ప్రయత్నం చేసింది. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో కూడా తొలి ప్రయత్నంలో 94 కేజీలు ఎత్తిన సోనియా 103 కేజీల లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైంది. సంధ్యా రాణి దేవి 165 (70+95) కేజీలతో కాంస్యం గెలుచుకుంది.

పురుషుల 56 కేజీ విభాగంలో తెలుగు తేజం వల్లూరి శ్రీనివాసరావు కాంస్యంతో మెరిశాడు. స్నాచ్‌లో 107 కేజీలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 141 కేజీలు.. మొత్తం 248 కేజీలతో అతడు మూడో స్థానంలో నిలిచాడు. భారత లిఫ్టర్‌ సుఖెన్‌ డే 252 (112+140) కేజీలతో రజతం నెగ్గాడు. అమిరుల్‌ హమీజాన్‌ (మలేసియా) 257 (116+141) కేజీలతో స్వర్ణం సాధించాడు.

టెన్నిస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. సింగిల్స్‌ తొలి రౌండ్లో రోహన్‌ బోపన్న, రష్మి చక్రవర్తి విజయం సాధించారు. బోపన్న 6-1, 6-4తో రొబెర్‌ బుయింజా (ఉగాండా)పై అలవోకగా గెలవగా.. మహిళల సింగిల్స్‌ రష్మి 6-0, 6-1తో పింకీ ఆగ్నెస్‌ (లెసొతో)ను చిత్తు చేసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో పేస్‌-సానియా జోడీ 6-1, 6-0తో ఆల్బర్టన్‌-స్టేసీ నికిత (సెయింట్‌ లూసియా) జంటపై అలవోకగా నెగ్గింది. బోపన్న, వెటరన్‌ నిరుపమ వైధ్యనాథన్‌ జోడీ 3-6, 6-3, 3-6తో ఆస్ట్రేలియా జంట పాల్‌హాన్లి, అనస్తాసియా రొడియెనొవో చేతిలో పరాజయం పాలైంది.

ఈతలో తొలి రోజు ఒక్క పతకం రాకపోయినా భారత్‌ మెరుగైన ప్రదర్శన చేసింది. కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారి ఫైనల్‌ చేరింది. పురుషుల 4X100 మీ ఫ్రీస్టయిల్‌ రిలే హీట్స్‌లో వీర్‌ధవల్‌ ఖడే, అన్షుల్‌, అర్జున్‌, ఆరోన్‌ డిసౌజల బృందం ఆరో స్థానం (3:28.06)తో ఫైనల్లోకి ప్రవేశించింది. ఫైనల్లోనూ రాణించినా (3:27.14) పతకం దక్కించుకోవడంలో విఫలమైంది. ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. స్వర్ణం సాధించిన ఆస్ట్రేలియా జట్టు కంటే భారత జట్టు 13.22 సెకన్లు వెనుకబడింది. వ్యక్తిగత విభాగాల్లో శుభ, బద్రీనాథ్‌ సెమీఫైనల్‌ల్లో నిష్క్రమించారు. మిగతావారు హీట్స్‌లోనే తేలిపోయారు.

టేబుల్‌ టెన్నిస్‌ మహిళల టీమ్‌ విభాగంలో భారత్‌ 3-0తో శ్రీలంకను చిత్తు చేసింది. తొలి మ్యాచ్‌లో మౌమా దాస్‌ 11-9, 11-5, 11-4తో ఇషారా మదురాంగిపై, రెండో మ్యాచ్‌లో షామిని 11-9, 11-9, 11-7తో నువామి నవోద్యపై గెలిచి జట్టుకు 2-0తో విజయాన్ని అందించారు. జాతీయ ఛాంపియన్‌ పౌలోమి ఘటక్‌ 11-8, 11-8, 11-7తో రుక్మలిని ఓడించి జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని అందించింది. తర్వాతి రౌండ్లో భారత్‌.. న్యూజిలాండ్‌తో తలపడుతుంది.

బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగం (గ్రూప్‌-డి)లో ఆతిథ్య భారత్‌ 5-0తో కెన్యాను చిత్తు చేసింది. తొలి మ్యాచ్‌లో విక్టర్‌ ముంగాను ఓడించి చేతన్‌ ఆనంద్‌ జట్టుకు 1-0 ఆధిక్యం అందించాడు. స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ వరుస సెట్లలో మెర్సీ జోసెఫ్‌ను చిత్తు చేసింది. పురుషుల డబుల్స్‌లో సనావే థామస్‌, రూపేశ్‌ కుమార్‌ల జోడీ జట్టుకు 3-0 ఆధిక్యంతో పాటు విజయాన్ని ఖాయం చేసింది. మహిళల డబుల్స్‌లో అశ్విని, అపర్ణ జోడీ, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో జ్వాల, దిజు జంట విజయాలతో భారత్‌కు 5-0 ఆధిక్యాన్ని సంపాదించింది.

పురుషుల వ్యక్తిగత రికర్వ్‌ క్వాలిఫయింగ్‌లో రాహుల్‌ బెనర్జీ, జయంత తాలుక్‌దార్‌ తొలి రెండు స్థానాలు సాధించారు. మహిళల విభాగంలో 609 పాయింట్లతో ప్రపంచ మాజీ ఛాంపియన్‌ దీపికా కుమారి అగ్రస్థానం దక్కించుకుంది. డోలా బెనర్జీ రెండో స్థానంలో నిలిచింది. మంగళవారం ఎలిమినేషన్‌ రౌండ్‌ జరుగుతుంది.స్క్వాష్‌లో భారత పతక ఆశలకు ఎదురుదెబ్బ. జ్వరం కారణంగా స్టార్‌ క్రీడాకారిణి దీపికా పల్లికల్‌ మహిళల సింగిల్స్‌ నుంచి తప్పుకుంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+