పారిస్ పారాలింపిక్స్లో కాంస్య పతకం నెగ్గిన తెలంగాణ బిడ్డ దీప్తి జీవాంజికి సీఎం రేవంత్ రెడ్డి భారీ నజరానా ప్రకటించారు. దీప్తికి రూ.కోటి నగదుతో పాటు గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్లో 500 గజాల స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే దీప్తి కోచ్ నాగపురి రమేష్కు రూ.10 లక్షల నగదును అందివ్వాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
మహిళల 400 మీటర్ల టీ-20 విభాగం ఫైనల్లో దీప్తి జీవాంజి 55.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని మూడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. కాగా, దీప్తి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామం. ఆమె నిరుపేద కుటుంబంలో మేధోపరమైన బలహీనతతో జన్మించింది.

పరుగు పందెంలో రాణించిన దీప్తిని స్కూల్ పీఈటీ ప్రోత్సహించాడు.ఆ తర్వాత ఇండియా జూనియర్ అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ నాగపురి రమేశ్ శిక్షణతో ఆమె కథ మారిపోయింది. రమేశ్ ఆమెను హైదరాబాద్కు తీసుకొచ్చి గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సెంటర్లో చేర్పించారు. ఆ తర్వాత శిక్షణలో దీప్తి రాటుదేలింది.
కోచ్ రమేశ్ శిక్షణతో, పుల్లెల గోపించంద్ అండతో ఆమె పారా అథ్లెట్గా పతకాల వేట కొనసాగిస్తోంది. ఆసియా పారా గేమ్స్ 400 మీటర్ల ఈవెంట్లో, వరల్డ్ పారా గ్రాండ్ ప్రీలోనూ 400 మీటర్లలో స్వర్ణాలు సాధించింది. వరల్డ్ చాంపియన్గా, వరల్డ్ రికార్డు హోల్డర్గా పారిస్ పారాలింపిక్స్లో బరిలోకి దిగి కంచు మోత మోగించింది.
''కాంస్య పతకం గెలవడం సంతోషంగా ఉంది. కానీ బంగారు పతకం గెలవడమే నా లక్ష్యం. నాకు కాస్త అనారోగ్యంగా ఉండటం వల్ల పసిడి అందుకోలేకపోయాను. భవిష్యత్లో బంగారు పతకం సాధిస్తా. నా కోచ్, తల్లిదండ్రులు నా విజయానికి పూర్తిగా సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. ఎనిమిదేళ్ల కఠోర శ్రమకు ఫలితం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ థ్యాంక్స్'' - దీప్తి జీవాంజి
ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ పారాలింపిక్స్ 2024లో పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ జీవాంజి దీప్తి గారిని ముఖ్యమంత్రి @revanth_anumula గారు సత్కరించారు. విశ్వ వేదికపై సత్తా చాటిన పారా అథ్లెట్ దీప్తి గారికి గ్రూప్-2 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం, 1 కోటి రూపాయల నగదు బహుమానం,… pic.twitter.com/t9ucA7DRY5
— Telangana CMO (@TelanganaCMO) September 7, 2024