
అసలేం జరిగింది?
అర్జున అవార్డు సాధించినందుకు జ్యోతి సురేఖకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు రూ. కోటి నగదు ప్రోత్సాహాకాన్ని ప్రకటించింది. అందులో రూ.15 లక్షలను కోచ్ చెరుకూరి సత్యనారాయణకు ఇచ్చేలా శాప్ అధికారులు జీవో జారీ చేశారు. తనకు ప్రకటించిన ప్రోత్సాహకంలో కోత విధిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయంపై జ్యోతి సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

రూ.15 లక్షలను కోచ్కు ఇచ్చేలా జీవో జారీ
తన ప్రతిభను మెచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.కోటి ప్రోత్సాహకంగా ఇస్తే, శాప్ అధికారులు అందులో రూ.15 లక్షలను కోచ్కు ఇచ్చేలా జీవో జారీ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఈ విషయమై జ్యోతి సురేఖ మాట్లాడుతూ 2013లోనే చెరుకూరి సత్యనారాయణకు చెందిన ఓల్గా ఆర్చరీ అకాడమీ నుంచి బయటకు వచ్చేశానని చెప్పుకొచ్చింది.

కోచ్ కాదు... కేవలం వార్డన్ మాత్రమే
చెరుకూరి తనకు కోచ్ కాదని.. ఆయన కేవలం వార్డన్ మాత్రమేనని వెల్లడించింది. తనను సంప్రదించకుండా సత్యనారాయణను కోచ్గా శాప్ అధికారులు ఎలా నిర్ణయిస్తారని ఆమె ప్రశ్నించింది. క్రీడాకారులను సీఎం ప్రోత్సహిస్తున్నా శాప్ మాత్రం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.

వేధింపులకు దిగుతున్నారని జ్యోతి సురేఖ ఆవేదన
గతంలో క్రీడాకారులకు ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రోత్సాహకాన్ని యథాతథంగా అందిచేవారని.. ప్రస్తుతం శాప్లోని కొందరు ఉన్నతాధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. క్రీడాకారిణిగా తనకు శాప్ నుంచి కనీస ప్రోత్సాహం లేకపోగా.. వేధింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా చేస్తే భవిష్యత్తులో రాష్ట్రం తరపున ఎలా ఆడాలని ప్రశ్నించింది.


Click it and Unblock the Notifications












