ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో పురుషుల డబుల్స్ లో భారత మరో జోడీ అదరగొట్టింది. బర్మింగ్ హామ్ లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేతలయిన భారత అగ్రశ్రేణి జోడీ చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి.. రౌండ్ ఆఫ్ 16లో గెలుపొంది క్వార్టర్స్ చేరుకున్నారు. వారు 21-12, 21-10 తేడాతో డానిష్ జంట జెప్పీ బే లాస్సే మోల్హెడేపై గెలుపొందారు. ఇక క్వార్టర్స్ లో వీరిద్దరు డిఫెండింగ్ ఛాంపియన్లు అయిన జపాన్ జోడి టకురో హోకి, యుగో కొబయాషితో తలపడనున్నారు. అంతకుముందు.. సాత్విక్, చిరాగ్ 21-8, 21-10తేడాతో జోనాథన్ సోలిస్, అనిబాల్ మారోక్విన్ ల గ్వాటెమాలన్ జోడీని ఓడించి ప్రీ-క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నారు. చిరాగ్, సాత్విక్ లకు ప్రారంభ రౌండ్ లో బై లభించడంతో కలిసొచ్చింది. అంతకుముందు.. భారత పురుషుల డబుల్స్ జంట ధృవ్ కపిల, ఎంఆర్ అర్జున్ గురువారం బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో తొలిసారిగా క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. మేము చాలా సంతోషిస్తున్నాం. ప్రతి మ్యాచ్ లాగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ కు కూడా సిద్ధమయ్యాం. మా గత మ్యాచ్ తో పోలిస్తే మేము విభిన్న వ్యూహాలను ఉపయోగించాం. రౌండ్ ఆఫ్ 16లో మా ప్రత్యర్థులు చాలా వేగంగా ఆడతారు కాబట్టి వాళ్లపై మేము కాస్త అదనపు వ్యూహాలతో సిద్ధమవ్వడం కలిసొచ్చింది. మేము తొలి రౌండ్ ఓడాక చాలా భయాందోళన ఎదుర్కొన్నాం.. కానీ అదృష్టవశాత్తూ మేము దాన్ని అధిగమించి చివరి రెండు సెట్లను గెలుచుకోగలిగాం అని అర్జున్ విజయం తర్వాత BWF టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు.