
బీజింగ్: జపాన్ వేదికగా ఈనెల 23న ప్రారంభం కాబోతున్న ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021 కోసం చైనా భారీ టీమ్ను పంపనుందట. 2016 రియో ఒలింపిక్స్లో 416 మందిని పంపిన చైనా.. ఈసారి అంతకుమించి పంపనుందని సమాచారం. 2016 ఒలింపిక్స్ రికార్డును తిరగరాయాలని చైనా చూస్తోంది. ఒలింపిక్స్ కోసం చైనా నుంచి ఇప్పటికే 30 క్రీడల్లో 224 ఈవెంట్స్ కోసం 318 మంది క్వాలిఫై అయినట్లు అక్కడి న్యూస్ ఏజెన్సీ ఒకటి తెలిపింది. 2016 గేమ్స్లో చైనా నుంచి 26 క్రీడల్లో 210 ఈవెంట్లలో మొత్తం 416 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. అత్యధిక పతకాలే లసక్యంగా చైనా బరిలోకి దిగుతోంది.
టోక్యో ఒలింపిక్స్ 2021లో డైవింగ్, టేబుల్ టెన్నిస్, షూటింగ్, జిమ్నాస్టిక్స్, వెయిట్లిఫ్టింగ్ ఈవెంట్లలో గోల్డ్ మెడల్స్ సాధించాలని చైనా చూస్తోంది. వీటితో పాటు బ్యాడ్మింటన్, తైక్వాండో, సెయిలింగ్, రోయింగ్, కరాటె, వుమెన్స్ బాక్సింగ్, వుమెన్స్ వాలీబాల్, స్విమ్మింగ్లలోనూ మెడల్స్ ఆశిస్తోంది. టేబుల్ టెన్నిస్, జిమ్నాస్టిక్స్, బ్యాడ్మింటన్, తైక్వాండోలో స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. అయితే 37 ఏళ్లలో తొలిసారి చైనా మెన్స్ బాస్కెట్ బాల్ జట్టు మాత్రం ఒలింపిక్స్కు క్వాలిఫై కాలేదు. ఇది మాత్రం చైనాకు చేదువార్తే అని చెప్పాలి.
గతేది కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న టోక్యో ఒలింపిక్స్ జూన్ 23 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఒలింపిక్స్కు సమయం సమీపిస్తున్న వేళ.. టోక్యో గ్రామానికి వస్తున్న బృందాల్లో కరోనా కేసులు బయటపడుతుండటం నిర్వాహకుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా సెర్బియా బృందంలో ఓ కరోనా కేసు బయటపడింది. టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో నిర్వహించిన పరీక్షల్లో సెర్బియా రోయింగ్ జట్టులోని ఒక అథ్లెట్కు పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో అతన్ని అక్కడే ఐసోలేషన్కు పంపారు. అతడితో కలిసి ప్రయాణించిన మరో నలుగురిని కూడా ఐసోలేషన్లో ఉంచారు. అంతకుముందు ఉగాండా బృందంలో కూడా ఓ కేసు నమోదైంది. రాబోయే రోజుల్లో వందల దేశాల నుంచి అథ్లెట్లు టోక్యోలో అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఇంకెన్ని కేసులు నమోదవుతాయో చూడాలి.
ప్రతిరోజు 10000 మంది ప్రేక్షకులను మాత్రమే స్టేడియాలకు అనుమతిస్తామని టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. స్టేడియాలకు వచ్చే ప్రేక్షకులు మాస్కులు ధరించాలి. స్టేడియంలో మరో ప్రేక్షకుడిని కలవకూడదు. నిర్దేశించిన సీటులోనే కూర్చోవాలి. కేరింతలు కొట్టకూడదు. పోటీల తర్వాత నేరుగా ఇంటికే వెళ్లాలి. క్రీడాకారుల్ని ఆటోగ్రాఫ్లు అడగడం, మద్దతు తెలపడం, మద్యపానం నిషేధం. ప్రేక్షకులు తమ ఆనందాన్ని బహిరంగంగా వ్యక్తం చేయొద్దని టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు సూచించారు.