గ్లెండాల్(అమెరికా): కోపా అమెరికా శతకోత్సవ పుట్బాల్ టోర్నీలో నంబర్ వన్ జట్టు అర్జెంటీనాకు చిలీ షాక్ ఇచ్చింది. డిపెండింగ్ ఛాంపియన్ చిలీ ఈసారి కూడా కప్పును ఎగరేసుకుపోయింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఫైనల్ సమరంలో అర్టెంటీనాపై చిలీ పెనాల్టీ షూటౌట్లో 4-2తేడాతో విజయం సాధించింది.
ఇరు జట్లు చివరి వరకూ హోరాహోరీగా తలపడటంతో మ్యాచ్ నిర్ణీత సమయంలో గోల్స్ నమోదు కాలేదు. పెనాల్టీ షూటౌట్లో చిలీ నాలుగు గోల్స్ చేయగా... మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా కేవలం రెండు గోల్స్ మాత్రమే చేసింది.

23 ఏళ్లుగా మేజర్ టైటిళ్ల కరవును తీర్చుకునేందుకు శాయశక్తులా శ్రమించిన అర్జెంటీనా ఫైనల్లో తడబడింది. జట్టును ఆదుకుంటాడని ఆశలు పెట్టుకున్న స్టార్ ఆడగాడు మెస్సీ ప్రభావం చూపలేకపోయాడు. దీంతో నిరుడు ఫైనల్లో పెనాల్టీ షూటౌట్లో తమను ఓడించి కప్పు చేజిక్కుంచుకున్న చిలీపై ప్రతీకారం తీర్చుకోవాలన్న అర్జెంటీనా ఆశలు గల్లంతయ్యాయి.
గ్రూప్ దశలో చిలీపై గెలిచినా ఫైనల్లో మాత్రం అర్జెంటీనా చేతులెత్తేసింది. కాగా, కోపా అమెరికా విజేత చిలీకి రూ. 25.37 కోట్లు, రన్నరప్ అర్జెంటీనాకు రూ. 19 కోట్ల ప్రైజ్మనీ దక్కనుంది.
కాగా, అర్జెంటీనా చివరగా మేజర్ టైటిల్ గెలిచింది 1993 కోపా అమెరికాలోనే కావడం గమనార్హం. ఆ తర్వాత అర్జెంటీనా వరుసగా మూడు మేజర్ టోర్నీల్లో (2007 కోపా, 2014 ప్రపంచకప్, 2015 కోపా) ఫైనల్ చేరినా రన్నరప్ ట్రోఫీలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.