
చెన్నై నగరం వేదికగా జరుగుతున్న చెస్ ఒలింపియాడ్ 44వ ఎడిషన్ను భారత ప్రధాని నరేంద్ర మోడీ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మోడీ కట్టుబొట్టు ఆకట్టుకున్నాయి. తమిళుల వేషధారణలో పంచెకట్టుకొచ్చాడు మోడీ సార్. తమిళుల సంప్రదాయంలో మగవారు పంచెకట్టు, భుజాన కండువా ధరిస్తుంటారనే విషయం తెలిసిందే. చెస్ ఒలింపియాడ్ ప్రారంభం సందర్భంగా మోడీ ప్రసంగించారు. చెన్నై మహానగరం చెస్ క్రీడకు పుట్టినిల్లుగా విరజిల్లుతుందని కొనియాడారు. గ్రాండ్ మాస్టర్ల నిలయంగా ఈ ప్రాంతం భాసిల్లుతుందని అభివర్ణించారు.
ఈ కార్యక్రామానికి ప్రధానితో సహా కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, మంత్రులు ఇతర అధికారులు హాజరయ్యారు. చెస్ ఒలింపియాడ్కు భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తుండడం వల్ల ఈ కార్యక్రమాన్ని భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అంతర్జాతీయ చెస్ అసోసియేషన్ యుద్ధం కారణంగా రష్యాపై వేటు వేసింది. ఫలితంగా ఇండియాకు ఆతిథ్య హక్కులు దక్కాయి. ఈసారి ఏకంగా 190దేశాలకు చెందిన చెస్ క్రీడాకారులు పాల్గొంటుండడం విశేషం.
తెలుగు తేజాలు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, అర్జున్ ఎరిగైసి వివిధ జట్లలో కీలక క్రీడాకారులుగా బరిలోకి దిగుతున్నారు. రష్యా, చైనా బరిలో లేకపోవడంతో స్వర్ణానికి అమెరికా బలమైన పోటీదారుగా మారింది. భారత్కు పసిడి రేసులో పెద్ద అడ్డంకి ఆ జట్టే. ప్రపంచ ఛాంప్ కార్ల్సన్ నార్వే జట్టుకు ఆడుతున్నాడు. అతను టోర్నీకే ప్రత్యేక ఆకర్షణ కానున్నాడు. ఈసారి పోటీలకు దూరంగా ఉన్న దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్.. భారత జట్లకు మెంటార్గా వ్యవహరించనున్నాడు.