
భారత్లో ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ జోష్ తారా స్థాయికి చేరుకుంది. ఈ మెగా ఈవెంట్కు భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. యుద్ధం వల్ల రష్యాపై వేటు పడడంతో అనూహ్యంగా ఒలింపియాడ్కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కించుకున్న భారత్.. పోటీల కోసం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 190 దేశాల క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఓపెన్, మహిళల విభాగంలో పోటీలు జరుగుతున్నాయి. ఇరు విభాగాల్లో భారత్ అదరగొడుతుంది. రెండు విభాగాల్లో మూడేసి చొప్పున భారత్ ఆరు జట్లను బరిలోకి దించింది. తెలుగు తేజాలు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, అర్జున్ ఎరిగైసి వివిధ జట్లలో రాణిస్తున్నారు. ఇకపోతే అయిదో రోజు భారత విజయాల పరంపర కొనసాగింది.
మహిళల విభాగంలో..
చెస్ ఒలింపియాడ్ మహిళల విభాగంలో భారత టాప్ సీడ్ (ఇండియా 1 టీం) 2.5-1.5 తేడాతో ఫ్రాన్స్ను ఓడించింది. తానియా సచ్దేవ్ నాలుగో బోర్డులో ఆండ్రియా నవ్రోటెస్కుపై విజయం సాధించి స్టార్గా నిలిచింది. కోనేరు హంపీ, ద్రోణవల్లి హారిక, ఆర్.వైశాలి పాల్గొన్న ఇతర గేమ్లు డ్రా అయ్యాయి.
మహిళల ఇండియా 2టీం జార్జియా 1-3 చేతులో ఓటమి పాలయింది.
మహిళల ఇండియా 3వ టీం బ్రెజిల్తో జరిగిన మ్యాచ్ను 2-2తో సమం చేసింది.
ఓపెన్ విభాగంలో..
ఇకపోతే ఓపెన్ విభాగంలో ప్లేయర్ అర్జున్ ఎరిగైసి మిర్సియా-ఎమిలియన్ పార్లిగ్రాస్పై కీలక విజయాన్ని సాధించడంతో ఇండియా టీం 1 రొమేనియాను 2.5-1.5తో ఓడించగలిగింది. మిగతా మూడు గేమ్లు, పెండ్యాల హరికృష్ణ, విదిత్ గుజరాతీ, S.L నారాయణన్ డ్రా చేశారు.
ఇండియా 2వ టీం నాలుగో సీడ్ స్పెయిన్పై 2.5-1.5 తేడాతో విజయం సాధించింది. డి.గుకేష్ అలెక్సీ షిరోవ్పై, బి.అధిబన్ ఎడ్వర్డో ఇటూరిజాగా బోనెల్లిపై విజయం సాధించారు. R. ప్రగ్నానంద జైమ్ శాంటోస్ లటాసా చేతిలో ఓడిపోగా.. నిహాల్ సరిన్, డేవిడ్ ఆంటోన్ గుయిజార్ మధ్య మ్యాచ్ డ్రా అయింది.
ఇండియా 3వ టీం 2.5-1.5 తేడాతో చిలీని ఓడించింది. ఫెర్న్ మొరోవిచ్, హ్యూగో లోపెజ్ సిల్వాపై S.P.సేతురామన్, అభిమన్యు పురానిక్ గెలుపొందారు.