హైదరాబాద్: అర్జున అవార్డు గ్రహీత, ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖకి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా గురువారం ప్రకటించింది. జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతులు మీదుగా మంగళవారం సురేఖ అర్జున అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.
గురువారం సాయంత్రం పలువురు విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. దీంతో జ్యోతి సురేఖకు ప్రోత్సాహకంగా రూ. కోటి అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 500 చదరపు గజాల ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తున్నట్టు చెప్పారు.

'ఆంధ్రప్రదేశ్ తరఫున సురేఖ గర్వించదగిన స్థాయిలో సుమారు 70 మెడల్స్ని ఆర్చరీలో సాధించింది. దక్షిణాదిలో అత్యంత పిన్న వయసులో అర్జున అవార్డు అందుకున్న క్రీడాకారిణి కూడా సురేఖనే' అని చంద్రబాబు ప్రశంసించారు. ఈ క్రీడలో మరింత రాణించేందుకు అన్ని విధాలాఅండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో విశేష ప్రతిభ కనబరుస్తున్న పదిమంది అగ్రశ్రేణి క్రీడాకారులను గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా యువజన, క్రీడలశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఆదేశించారు.
ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్న సురేఖ.. ఒలింపిక్స్లో దేశానికి పతకం సాధించాలనే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబుతో వెల్లడించింది.