
గుడ్ న్యూస్. ఈ సారి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం క్రీడలకు నిధులు పెంచింది. మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ వేదికగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం 39 లక్షల కోట్ల రూపాయలకుపైగా అంచనాలతో ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్లో క్రీడలకు గతేడాదితో పోలిస్తే ఈ సారి 305.58 కోట్ల రూపాయలను పెంచారు. మొత్తంగా ఈ ఏడాది క్రీడలకు 3,062.60 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ ఏడాది బర్మింగ్హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు, హాంగ్జౌ వేదికగా ఆసియా క్రీడలు ఉండడంతో బడ్జెట్లో కేటాయింపుల్ని గణనీయంగా పెంచారు.
గతేడాది బడ్జెట్లో క్రీడలకు మొదట 2,596.14 కోట్ల రూపాయలను కేటాయించగా.. తర్వాత పలు కారణాలతో దీన్ని 2757.02 కోట్ల రూపాయలకు సవరించారు. దాదాపు క్రీడల్లోని అన్ని ఈవెంట్లకు గతేడాదితో పోలిస్తే ఈసారి ఎంతో కొంత ఎక్కువ నిధులను కేటాయించడం గమనార్హం.
ఖేలో ఇండియా కార్యక్రమం కోసం గతేడాది 657.71 కోట్ల రూపాయలను కేటాయించగా.. ఈ సారి దానిని పెంచుతూ 974 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రోత్సాహక అవార్డులు, రివార్డుల కోసం గత బడ్జెట్లో 245 కోట్ల రూపాయలను కేటాయించగా.. ఈ బడ్జెట్లో దానిని 357 కోట్ల రూపాయలకు పెంచారు. జాతీయ క్రీడాభివృద్ధికి గతేడాది 9 కోట్ల రూపాయలు కేటాయించగా.. ఈ సారి దానిని 16 కోట్ల రూపాయలకు పెంచారు.
ఇక జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)ల విభాగంలో ఎటువంటి పెరుగుదల లేదు. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా 280 కోట్ల రూపాయలను కేటాయించారు. స్పోర్ట్స్ అథారిటీ (సాయ్)కి కూడా ఎటువంటి పెరుగుదల లేకుండా గతంలో మాదిరిగానే ఈ బడ్జెట్లో కూడా 653 కోట్ల రూపాయలను కేటాయించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో 2022 సంవత్సరానికిగానూ బడ్జెట్ ప్రేవేశ పెట్టారు. మొత్తం 39,44,909 లక్షల కోట్ల రూపాయలతో ఈ సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్లో అత్యధికంగా దేశ రక్షణ రంగానికి 5.25 లక్షల కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ-విద్య కోసం 200 టీవీ ఛానెళ్లు ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో మంత్రి తెలిపారు. 100% డిజిటలైజేషన్తో పోస్టల్లో బ్యాంకింగ్ చేపట్టనున్నట్లు చెప్పారు.
ఆదాయపన్ను శ్లాబుల్లో ఎటువంటి మార్పు చేయనప్పటికీ, డిజిటల్ కరెన్సీ లావాదేవీలపై 30% పన్ను విధించనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సహకార సంఘాలపై పన్ను తగ్గిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పన్ను ఎగవేతదారుల పట్ల ఇక నుంచి మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.