
హైదరాబాద్: భారత స్టార్ రెజ్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ సుశీల్ కుమార్పై ఢిల్లీ పోలీసులుస కేసు నమోదు చేశారు. కామన్వెల్త్ గేమ్స్ కోసం ఇందిరాగాంధీ స్టేడియంలో రెజ్లింగ్ సెలెక్షన్ ట్రయల్స్ సుశీల్, అతని మద్దతుదారులు సహచర రెజ్లర్ ప్రవీణ్ రాణాపై దాడికి పాల్పడ్డారు.
ఈ మేరకు ఫిర్యాదు రావడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రవీణ్ రాణా సోదరుడు నవీన్ రాణా ఫిర్యాదు మేరకు సుశీల్ కుమార్, అతని మద్దతు దారులపై సెక్షన్ 323, 341 కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలేం జరిగింది?
ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం కామన్వెల్త్ గేమ్స్ రెజ్లింగ్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్స్లో సుశీల్ కుమార్ అన్ని బౌట్లు గెలిచాడు. సెమీఫైనల్లో రాణాపై విజయం అనంతరం సుశీల్-పర్వీన్ మద్దతుదారుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో భాగంగా సుశీల్ కుమార్ మద్దతుదారులు పర్వీన్ రాణాపై దాడికి దిగారు.
ఈ దాడిలో పర్వీన్ రాణాకి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో సుశీల్తో పోటీపడేందుకు గాను తనతో పాటు, తన అన్నను అతడి మద్దతుదారులు కొట్టారని రాణా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు బౌట్ సందర్భంగా రాణా తనను కొరికాడని సుశీల్ చెప్పడం విశేషం.
ఇదే సమయంలో జనవరిలో ప్రారంభంకానున్న ప్రొరెజ్లింగ్ లీగ్లో పాల్గొంటే తనను చంపుతానంటూ సుశీల్ మద్దతుదారులు బెదిరిస్తున్నారని రాణా ఆరోపించడం ఇప్పడు సంచలనం సృష్టిస్తోంది. కాగా, వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలోని గోల్ట్కోస్ట్లో జరిగే కామన్వెల్త్ క్రీడలకు 74 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో పాల్గొనేందుకు సుశీల్ అర్హత సాధించిన సంగతి తెలిసిందే.