భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ అప్పీల్ను తిరస్కరించడానికి గల కారణాలను కోర్టు ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) వివరించింది. పారిస్ ఒలింపిక్స్లో మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్కు చేరిన వినేశ్ అదనంగా 100 గ్రాములు ఎక్కువగా ఉండడంతో అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. అయితే తనకు కనీసం సంయుక్తంగా రజత పతకమైనా ఇవ్వాలని వినేష్ కాస్లో అప్పీల్ చేసింది.
కాగా, ఆగష్టు 14నే దీన్ని తిరస్కరించిన కాస్ తాజాగా వివరణ ఇచ్చింది. తమ బరువు పరిమితి లోపు ఉండే బాధ్యత అథ్లెట్లదేనని స్పష్టం చేస్తూ తీర్పు కాపీలో కాస్ పేర్కొంది. ''నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. బరువు విషయంలో నిబంధనలు అందరికీ ఒకటే. గరిష్ఠ బరువుకు లోబడే ఉండాలి. ఎవరికీ మినహాయింపు ఉండదు. కనీసం గ్రాము బరువు ఎక్కువగా ఉన్నా అనుమతించడం కుదరదు. ఇందుకు పూర్తి బాధ్యత రెజ్లర్దే.

''వినేశ్ తనకు తానుగానే 50 కిలోల విభాగాన్ని ఎంచుకుంది. కాబట్టి ఆమెకు తన బరువు ఎంత ఉండాలో తెలుసు. అధిక బరువు ఉన్నానని వినేశ్ స్పష్టంగా పేర్కొంది. ఇందులో ఎలాంటి వివాదం లేదు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా పొందుపరిచింది. దరఖాస్తుదారు అనుభవమున్న రెజ్లర్. గతంలో ఇలాంటి నిబంధనల నడుమ పోటీపడింది. రూల్స్ అర్థం చేసుకోలేకపోయిందనే సమస్యే తలెత్తదు'' అని కాస్ వివరించింది.
తొలి బౌట్లో ఒలింపిక్ చాంపియన్ యు యి సుసాకిపై సంచలన విజయం సాధించిన వినేశ్ ఆ తర్వాత క్వార్టర్స్, సెమీస్లోనూ గెలుపొంది ఫైనల్కు చేరింది. ఒలింపిక్స్ ఫైనల్కు చేరిన తొలి భారత మహిళా రెజ్లర్గా రికార్డుల్లోకెక్కింది. అయితే సెమీస్ పూర్తయ్యాక వినేశ్ 50 కిలోలకు మించి ఉంది.
దాంతో సెమీఫైనల్ ముగియగానే వినేశ్ బరువు తగ్గించడం కోసం స్కిప్పింగ్, జాగింగ్, సైక్లింగ్, ఆవిరి స్నానం చేసింది. అంతేగాక ఆహారం తీసుకోకుండా, మంచినీరు తాగకుండా రాత్రంతా మేల్కొంది. జుత్తు కూడా కత్తిరించుకుంది. శరీరంలో కొంత రక్తం కూడా తీయించుకుందని సమాచారం. కానీ ఆమె నిర్ణీత 50 కేజీల కంటే 100 గ్రాముల అదనంగా ఉంది. రుతుస్రావానికి ముందు దశలో అధికంగా నీరు తాగడం వల్లే ఇలా జరిగిందని, తగిన సమయం లేనందు వల్లే బరువు తగ్గించలేకపోయానని మినహాయింపు ఇవ్వాలని కాస్ను వినేశ్ కోరింది. కానీ ఆమె అప్పీల్ను కాస్ తిరస్కరించింది.