దక్షిణాఫ్రికాతో ఆరంభమైన టీ20 సిరీస్ లో భారత్ బోణీ కొట్టింది. మంగళవారం రాత్రి కటక్ లో జరిగిన తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా విధ్వంసం రేపాడు. 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 59 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిడిలార్డర్ లో తిలక్ వర్మ- 26, అక్షర్ పటేల్- 23 మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ సాధించారు.
అనంతరం దక్షిణాఫ్రికా 12.3 ఓవర్లలో 74 పరుగులకు కుప్పకూలింది. ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. టీ20ల్లో ఆ జట్టు లోయెస్ట్ స్కోర్ ఇదే. 22 పరుగులు కొట్టిన డెవాల్డ్ బ్రేవిస్ ఒక్కడే టాప్ స్కోరర్గా నిలిచాడంటే మిగిలిన బ్యాటర్లు ఎంత పేలవంగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. స్టార్ బ్యాటర్లందరూ నిరాశపరిచారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్- 2, జస్ప్రీత్ బుమ్రా- 2, వరుణ్ చక్రవర్తి- 2, అక్షర్ పటేల్- 2 వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే చెరో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. టీ20 ఇంటర్నేషనల్స్ లల్లో 100 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. మూడు ఫార్మాట్లలో కూడా వంద వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్గా నిలిచాడు. డెవాల్డ్ బ్రెవిస్ వికెట్ పడగొట్టడంతో వందో వికెట్ మార్క్ ను అందుకున్నాడు. ఇప్పటికే టెస్టుల్లో 234, వన్డేల్లో 149 వికెట్ల పడగొట్టాడు బుమ్రా.
ఇతర జట్లతో కంపేర్ చేస్తే మూడు ఫార్మట్లల్లో వంద వికెట్లు అందుకున్న బౌలర్లల్లో బుమ్రా అయిదోవాడు. అతనికంటే ముందు లసిత్ మలింగ- శ్రీలంక, షకిబుల్ హసన్- బంగ్లాదేశ్, టిమ్ సౌథీ- న్యూజిలాండ్, షాహిన్ అఫ్రిది- పాకిస్తాన్ మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు.
బుమ్రా పడగొట్టిన ఈ వందో వికెట్ దుమారానికి దారి తీసింది. బుమ్రా వేసిన షార్ట్ బాల్ను బ్రెవిస్ షాట్ ఆడగా.. టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి ఎగిరిన ఆ బంతిని కవర్స్ లో సూర్యకుమార్ యాదవ్ అందుకున్నాడు. ఈ డెలివరీ లీగాలిటీపై ప్రశ్నలు తలెత్తాయి. ఇది ఫ్రంట్ ఫుట్ నో బాల్ అనే వాదన ఉంది. అది నో బాలా కాదా అనేది తెలుసుకోవడానికి ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ను ఆశ్రయించారు. అనంతరం ఫెయిర్ డెలివరీగా ప్రకటించారు. బుమ్రా షూలోని కొంత భాగం క్రీజ్ వెనుక ఉందని నిర్ధారించారు.
ఇది క్లియర్ నో బాల్ అనే వాదన మొదలైంది. కెమెరా యాంగిల్స్ స్పష్టంగా లేనందు వల్ల బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అవుటేనని కామెంటేటర్ మురళీ కార్తీక్ చెప్పాడు. మరో కామెంటేటర్ దీన్ని వ్యతిరేకించాడు. ఇందులో బెనిఫిట్ ఆఫ్ డౌట్ అక్కర్లేదని, నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వికెట్లల్లో అమర్చిన కెమెరా ద్వారా అది నో బాల్ అనేది స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నాడు. డెవాల్డ్ బ్రెవిస్ దూకుడుగా ఆడుతున్న సమయంలో అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి అవుట్ కావడం దక్షిణాఫ్రికా బ్యాటింగ్ రిథమ్ ను దెబ్బతీసినట్టయిందని వ్యాఖ్యానించాడు.