అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణం
తను 2006లో ఆర్చరీ మొదలు పెట్టినట్లు దీప్తి తెలిపింది. '2006లో విలు విద్య నేర్చుకోవడం మొదలు పెట్టి జాతీయ స్థాయిలో అనేక పోటీల్లో పాల్గొన్నా' అని ఆమె చెప్పింది. కాడెట్ వరల్డ్ ఛాంపియన్షిప్లో కూడా పాల్గొన్న ఆమె.. ఆ పోటీల్లో 60 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది.
50 మీటర్ల విభాగంలో కాంస్యం, 30 మీటర్ల విభాగంలో రజత పతకాలు తన ఖాతాలో వేసుకుంది. అయితే ఆ పోటీలు ముగిసిన తర్వాత తన విల్లు విరిగిపోయిందని ఆమె తెలిపింది. మరో ప్రొఫెషనల్ విల్లు కొనిపెట్టే స్థోమత తన తల్లిదండ్రులకు లేదని ఆమె వెల్లడించింది.
వెదురు విల్లుతోనూ పతకాలు
తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి అప్పటికే బాగలేదని చెప్పిన ఆమె.. తనకు మొదటి విల్లు కొనిపెట్టడం కోసం తల్లి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వద్ద రూ.7 లక్షల అప్పు తీసుకున్నట్లు తెలియజేసింది. ఆ డబ్బులో రూ.4.5 లక్షలు పెట్టి ప్రొఫెషనల్ ఆర్చరీ ఎక్విప్మెంట్ కొనుగోలు చేసినట్లు తెలిపింది.
ఆ విల్లు విరిగిపోవడంతో తన జీవితం మారిపోయిందని చెప్పింది. ఆ తర్వాత ఒక వెదురు విల్లు కొనుక్కొని జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న దీప్తి.. ఆయా పోటీల్లో పలు పతకాలు సాధించింది. 2018 వరకు ఈ పోటీల్లో సత్తా చాటింది. అయితే అంతర్జాతీయ పోటీల్లో బాంబూ విల్లులను అనుమతించరు. దీంతో ఆమె ఆ పోటీలకు వెళ్లలేకపోయింది.
అప్పు తీర్చడం కోసం
'నేను ఇప్పటికీ గురి తప్పకుండా లక్ష్యాన్ని కొట్టగలను. నాకంటూ ఒక ఉద్యోగం ఉంటే కుటుంబాన్ని పోషించుకుంటూ ప్రాక్టీస్ చేయాలని ఉంది. కచ్చితంగా పతకాలు గెలుస్తాననే నమ్మకమూ ఉంది' అని ఆమె చెప్పింది. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఆ రాష్ట్ర సీఎం హామీ ఇవ్వడంతో తను కూడా దరఖాస్తు చేశానని, కానీ తనకు ఇప్పటి వరకు ఎలాంటి కాల్ రాలేదని తెలిపింది.
అదే సమయంలో తల్లి చేసిన అప్పు తీర్చడం కోసం ఏం చేయలేని స్థితిలో రాంచీలో టీ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నట్లు ఆమె పేర్కొంది.