న్యూఢిల్లీ: భారత బాక్సర్ సరితాదేవిపై ఏఐబీఏ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. రిఫరీలు అన్యాయం చేశారంటూ సరితాదేవి నిరసన వ్యక్తం చేయడం, కాంస్య పతకాన్ని తిరిగి ఇచ్చేసిన ఘటనకు సంబంధించిన సరితాదేవిని సస్పెండ్ చేస్తున్నట్లు ఏఐబీఏ ప్రకటించింది.
వివరాల్లోకి వెళితే దక్షణి కొరియాలోని ఇంచియాన్లో జరిగిన ఆసియా గేమ్స్ సెమీ ఫైనల్లో రిఫరీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి దక్షిణ కొరియా బాక్సర్ జినా పార్క్ గెలిచినట్లు ప్రకటించారని సరితాదేవి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

బౌట్లో సరితాదేవి పూర్తి ఆధిక్యం కనబర్చినా జడ్జీలు జినా పార్క్ గెలిచినట్లు ప్రకటించారు. దీనిపై అప్పీల్ చేసినా పట్టించుకోలేదు. కాంస్య పతకం తీసుకునేందుకు పోడియం వద్దకు పిలిచినప్పటి నుంచి సరితాదేవి ఏడుస్తూనే ఉంది. పతకం తీసుకోవడానికి కూడా నిరాకరించి దానిని రజత పతకం సాధించిన జినా పార్క్ కే ఇచ్చేసింది. దీంతో షాక్ కు గురైన జీనా పార్క ఏం చేయాలో తెలియక... పోడియం వద్ద ఉంచి ఆమె కూడా వెళ్లిపోయింది.
దీంతో ఆ కాంస్య పతకాన్ని ఆసియా గేమ్స్ నిర్వహకులు తమ వద్దే ఉంచుకున్నారు. ఒకటిన్నర సంవత్సరాల బాబును కుడా వదలిపెట్టి కఠోరమైన శిక్షణ తీసుకున్నానని, చివరకు తన కొడుకు కూడా ఒకదశలో తనన్ని గుర్తు పట్టలేకపోయాడని సరితా దేవి వాపోయింది. దీని తర్వాత వచ్చే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు సరిదాదేవి చెప్పిన విషయం తెలిసిందే.